విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలోని సత్యసాయి మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆచార్య దేవకీ శ్రీనివాస భవనంలో శనివారం ‘మనలో మనం’ సమూహ సభ్యులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మనలో మనం’ సమూహ సభ్యులు రాసిన “తొలి అడుగు” కవితా సంకలనంను ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆచార్య మహాసముద్రం దేవకీ రచించిన ” ఇర్ల చెంగి” కథా సంకలనాన్ని డా. అనంత మాలతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ‘మనలో మనం’ సమూహం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందనీయం అని చెప్పారు. ‘మనంలో మనం’ సమూహం ద్వారా సమాజంలో జరుగుతున్న అసమానతలు, అసాంఘిక కార్యక్రమాల పట్ల ప్రజలను,మహిళలను చైతన్యపరిచే విషయాలను గురించి చర్చించి, ప్రజలను ఆలోచింప చేసే విధంగా వివిధ రకాల కథలను, కవిత సంకలనాలను రాస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం సాకేంతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికి మహిళల పట్ల మాత్రం వివక్ష చూపుతునే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఉత్తేజపరిచడానికి ‘మనలో మనం’ సమూహంలో ఎన్నో నవలలు, కవితలు, కథలను రాస్తున్నారని తెలిపారు. ‘మనలో మనం ‘ సమూహం కలయికకు చొరవ చూపిన నిర్మలా రాణి గారికి సమూహ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిర్మలా రాణి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, దేవకి, బిజిలి, సుజాత, శ్రీదేవి, స్వర్ణలత, ప్రగతి, నబిరసుల్, అశ్వర్థరెడ్డి, శశికళ, ఉషారాణి, చిలకలూరి దీవెన, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.