విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబలం, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, పీకలబెట్ట, బసలదొడ్డి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో శనివారం మొహరం వేడుకలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు . మహ్మద్ ప్రవక్త మనవళ్లు అయిన అసేన్, హుస్సేన్ త్యాగాలకు గుర్తుగా మొహరం పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం పీర్లకు చక్కెర, బెల్లం, పూలహారాలతో మొక్కుబడులు చెల్లించి కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక ఫాతిహాలను చదివించారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో వేకువజామున నుంచే పీర్లు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రత్యేక పూజలు అందుకున్నారు. జమియా మసీదు వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో గుమ్ముటీలయ్య అశేష భక్తివాహిణి నడుమ నడిచారు. అలాగే పీకలబెట్ట గ్రామంలో అగ్నిగుండంలో కూర్చుని జుబేర్ తాత రొట్టెలు కాల్చి తన మహిమను చాటుకొన్నారు. సాయంత్రం అన్ని గ్రామాల్లో పీర్లను ఘనంగా ఏటికి పంపించారు. మొహరం వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై మహేష్ కుమార్ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.