జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ
విశాలాంధ్ర – ఏలూరు: జిల్లా పరిషత్ నిధులతో మండల పరిధిలో చేపట్టే పనులలో జెడ్పిటిసి సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ లోని సమావేశపు హాలులో శనివారం జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పిటిసి లు తమ పరిధిలోని గ్రామాలలో సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటికి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల ద్వారా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ద్వారా మండల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులలో స్థానిక జెడ్పిటిసి ల సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాభివృద్ధి లక్ష్యంతో జిల్లా పరిషత్ ద్వారా గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతీ ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కుళాయి కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. సత్యసాయి మంచినీటి పధకం ద్వారా జిల్లాలోని మెట్ట ప్రాంతాలలోని 151 గ్రామాలలోని ప్రజలకు తాగునీరు అందించామన్నారు. నవరత్నాలలలో భాగంగా గృహ నిర్మాణ పధకాన్ని పూర్తిగా అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న వర్షాకాలం ను దృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాలలో పూర్తి పారిశుధ్య పరిస్థితులు ఉండేలా చూడాలని, దోమల నిర్మలన చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా పాడైన రోడ్లకు మరమత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనె, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నదని , ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ బృందాలు పనుల నాణ్యతను పరిశీలిస్తామని, నాణ్యత ప్రమాణాలు పాటించని పనులపై నివేదికను సమర్పిస్తాయన్నారు. కొల్లేరు కాంటూర్ పరిధిలో లైడాల్ విధానం ద్వారా భూములను రీ సర్వే చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలలో విద్యా, వైద్యం నకు సంబందించిన సదుపాయాలతోపాటు, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు .శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఎంపిటిసి లకు గౌరవ వేతనం పెంచాలని కోరారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో పి . హెచ్ సి ., ఏర్పాటు చేయాలనీ కోరారు. తణుకు, పెరవలి మండలాలలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించాలని కోరారు. పెరవలి మండలం మల్లేశ్వరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు దాతలు స్థలం అందించారని, ఆ ప్రదేశంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలనీ కోరారు.శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ లో సుమారు 400 మంది అటెండర్లు, స్వీపర్లు, ట్యాంక్ వాచ్మెన్, తదితర ఉద్యోగులకు 2010 నుండి పీ ఆర్ సి లు వర్తింప చేయలేదని, 20 నెలల డి. ఏ ., అమలు చేయలేదన్నారు. సదరు బకాయిలు చెల్లించాలని కోరారు.ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ ఇటీవల వరదలలో ముంపునకు గురైన ప్రాంతాలలోని ప్రజలకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, వరద బాధితులకు అండగా నిలిచి, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వరద సహాయక చర్యలు చేశారన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ద్వారా నిధుల కేటాయింపును అన్ని మండలాలకు సమానంగా కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ నంబూరి తేజ్ భరత్, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, జిల్లా పరిషత్ సీఈఓ కె. రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ్ శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, జెడ్పిటిసి లు, ఎంపిపి లు, ప్రభృతులు పాల్గొన్నారు.