మరో ముగ్గురి మృతి… ముగ్గురికి గాయాలు
ఇంఫాల్ : మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి తండ్రీకొడుకులు సహా ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని క్వాక్తా వద్ద ముగ్గురు నిద్రిస్తుండగా తుపాకీతో కాల్పులు జరిపి, కత్తులతో నరికి చంపారని, దుండగులు చురాచంద్పూర్ నుంచి వచ్చారని శనివారం ఉదయం పోలీసులు తెలిపారు. ‘ముగ్గురూ సహాయక శిబిరంలో ఉండేవారు. అయితే పరిస్థితి మెరుగుపడిన తర్వాత శుక్రవారం క్వాక్తాలోని వారి నివాసాలకు తిరిగి వచ్చారు’ అని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే ఆగ్రహించిన గుంపు క్వాక్తా వద్ద గుమిగూడి చురాచంద్పూర్ వైపు వెళ్లాలనుకుందని, కానీ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ‘శనివారం ఉదయం క్వాక్తా సమీపంలో రాష్ట్ర బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరగడంతో ఒక పోలీసుతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసు ముఖంపై గాయాలయ్యాయి. ముగ్గురినీ చికిత్స కోసం ఇంఫాల్లోని రాజ్ మెడిసిటీకి తీసుకువచ్చారు. వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు’ అని పోలీసులు తెలిపారు. ఇదిలాంఉడగా, హింస కారణంగా జిల్లా యంత్రాంగం జంట ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు వేళలను కుదించింది. ‘ఇంఫాల్ జంట జిల్లాల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపుకు బదులుగా ఇప్పుడు దానిని ఉదయం 5 నుంచి 10.30 గంటలకు కుదించాము’ అని ఒక అధికారి తెలిపారు. ఆగస్టు 4న కౌత్రుక్ కొండ శ్రేణిలో భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఏడు అక్రమ బంకర్లను ధ్వంసం చేసినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, శనివారం మణిపూర్లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చిన 24 గంటల సార్వత్రిక సమ్మె కారణంగా ఇంఫాల్ లోయలో సాధారణ జీవితం స్తంభించింది. దాదాపు అన్ని ప్రాంతాలలో మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.