. మణిపూర్పై సమాధానం చెప్పాల్సిందే
. సీఎంపై వేటు, రాష్ట్రపతి పాలన విధింపునకు ‘ఇండియా’ డిమాండ్
. లోక్సభలో ‘అవిశ్వాసం’పై అధికార`విపక్షాల వాడీవేడీ చర్చ
న్యూదిల్లీ: మణిపూర్, హరియాణాలో శాంతిభద్రతలు, మతసామరస్యాన్ని కాపాడటంలో కేంద్రప్రభుత్వం, ఆ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని ప్రతిపక్షాలు పార్లమెంటులో దుయ్యబట్టాయి. మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలు కాగా ఇండియా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ మణిపూర్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దేశ భద్రత, ఆర్థికవృద్ధి, మతసామరస్యం, వ్యవస్థల స్వయంప్రతిపత్తి తదితర అనేక సమస్యలపై సర్కార్పై ప్రశ్నాస్త్రాలు ఎక్కుబెట్టింది. సమస్యల పరిష్కారంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వైఫల్యాన్ని దుయ్యబట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, అధికారపక్షం మధ్య లోక్సభలో మంగళవారం చర్చలు వాడీవేడిగా సాగాయి. బుధవారం జరగబోయే చర్చలో అగ్రనేతలు అమిత్షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా వంటివారు పాల్గోనున్నట్లు పార్లమెంటు వర్గాల సమాచారం.
అయితే అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చను ముందు అనుకున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాకుండా ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. మణిపూర్లో అల్లర్లు, చైనా చొరబాట్లు తదితర కీలకాంశాలపై మోదీ మౌనాన్ని వీడాలని, సభకు వచ్చి మణిపూర్పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆయన నోరు విప్పేలా చేసేందుకే అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు రావాల్సి వచ్చిందని చెప్పారు. మోదీ మణిపూర్కు ఎందుకు వెళ్లలేదని, మణిపూర్పై నోరు విప్పడానికి మోదీకి 80 రోజుల సమయం ఎందుకు పట్టిందని, మణిపూర్ ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించలేదని గొగోయ్ ప్రశ్నించారు. మణిపూర్లో మోదీ పర్యటించాలని, అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, ఆ రాష్ట్రంలోని వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపడం ద్వారా శాంతి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మరో ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ మోదీ తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలతో నిండి ఉందన్నారు. మూడు నెలలుగా మణిపూర్ కాలిపోతుంటే ఆ రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు సర్కార్ చేసినదేమీ లేదని వ్యాఖ్యానించారు. ఈశాన్య ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంటుందని, అక్కడి రాష్ట్రాల్లో ఎక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాగానీ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే స్థితి రావచ్చని హెచ్చరించారు. చైనాతో సరిహద్దు వివాదం, వాణిజ్యలోటు వంటి అంశాలను ప్రస్తావించారు. సీపీఎం ఎంపీ ఏఎం ఆరీఫ్ మాట్లాడుతూ సభకు చాలా తక్కువగా హాజరైన రికార్డును ప్రధాని మోదీ నెలకొల్పారని ఎద్దేవా చేశారు. మణిపూర్ తగలబడిపోతున్న సమయంలో మోదీ విదేశాల్లో పర్యటించారని, సొంతింటిని చక్కబెట్టుకోవడంలో విఫలమైన ఆయన ప్రపంచ శాంతిపై ఫ్రాన్స్లో ప్రసంగం చేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన విధి నిర్వహణలో విఫలం కావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. హరియాణాలోనూ మతచిచ్చు పెట్టారని, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ పాలనలో రావణకాష్ఠం సాగుతోందని దుయ్యబట్టారు. ఎన్.బీరేసింగ్ను తక్షణమే మణిపూర్ సీఎంగా తొలగించాలని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ డిమాండ్ చేశారు. అధికరణ 356 కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు సీఎంపై వేటు వేయకపోవడాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతకు కేంద్రం వంత పాడుతోందనే అర్థమవుతోందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, మణిపూర్లోని రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు సద్దుమణిగేందుకు తగు విధంగా చర్యలను తక్షణమే తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఫెడరలిజానికి మోదీ తట్లూ పొడిరచినట్లు టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ‘మణిపూర్లో మన సోదర, సోదరీమణులు అష్టకష్టాలు పడుతూ ప్రాణాలు కోల్పోతుంటే కనీసం ఒక్క బృందాన్ని అక్కడకు పంపలేదు. మీకు దయలేదు కాబట్టే మణిపూర్కు వెళ్లలేదు. ఆ రాష్ట్రంలోని సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్తాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి’ అని రాయ్ అన్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ ‘మణిపూర్లో జరిగింది సిగ్గుచేటు. ఇవి జరగనిద్దామా? దేశ మహిళలను అవమానిద్దారా? ఇలాంటి ప్రభుత్వానికి మద్దతిద్దామా? ఇందుకు మీ మనస్సాక్షి అంగీకరిస్తుందా? అని సభాముఖ్యంగా ప్రశ్నించారు. ‘మణిపూర్ మండితే…భారత్ మొత్తం మండినట్లే. మణిపూర్ విడిపోతే భారత్ విభజన జరిగినట్లే. భారతదేశానికి నాయకుడిగా ప్రధాని మోదీ సభకు రావాలి. మణిపూర్పై మాట్లాడాలి. ఇదే మా డిమాండ్’ అని గొగోయ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం ద్వారా మోదీ మౌనవ్రతాన్ని బద్దలు కొట్టాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ డిరపుల్ యాదవ్ మాట్లాడుతూ ‘బీజేపీకి నైతిక, రాజకీయ బాధ్యత లేదా? సభకు రమ్మని ప్రధానిని కోరాం కానీ ఆయన రాలేదు’ అని అన్నారు. మణిపూర్లో హింసను అక్కడి ప్రభుత్వం పెంచిపోషిస్తోందని ఆరోపించారు. ఇది సాధారణ ఘటన కాదని చాలా సున్నితమైన అంశమని నొక్కిచెప్పారు. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, సామూహిక అత్యాచారం చేయడం, వారి మానవహక్కులను హరించడం, హింసను రెచ్చగొట్టేందుకు మహిళలను పావులుగా వాడుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయా ఘటనల్లో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్టు చేశారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని నిలదీశారు. మోదీ ప్రభుత్వం రాజధర్మాన్ని మరిచిందని విపక్ష నేతలు విమర్శించారు. వాజ్పేయి పాలన గురించి అనేకమార్లు ప్రస్తావించారు.
ఇది సరైన సమయం కాదు: రిజిజు
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తప్పుడు సమయంలో ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి కిరెన్ రిజుజు అన్నారు. ప్రపంచ నేతగా మోదీ ఆవిర్భవించిన వేళ 2024 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ముందుకెళుతున్న సమయంలో ఇలాంటి తీర్మానాన్ని తీసుకు రావడం సమంజసం కాదన్నారు. 2024లో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపే కసరత్తులో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘కొన్ని సార్లు మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాంగానీ అది దేశానికి వ్యతిరేకంగా పరిణమిస్తుంది. మణిపూర్పై భారత్ను ఈయూ పార్లమెంట్ ఖండిరచిందని చెప్పడం గర్వకారణమా? కశ్మీర్ లేక మణిపూర్… పరిస్థితి ఏమైనాగానీ భారతీయ ప్రభుత్వాన్ని ప్రాశ్చాత్య శక్తులు ప్రభావితం చేయగలిగిన రోజులు పోయాయి.’ అని రిజుజు వ్యాఖ్యానించారు. భారత అంతర్గత అంశాలను విదేశీ విశ్వవిద్యాలయాల్లో లేవనెత్తారంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. మీకు బీజేపీ లేక మోదీ అంటే గిట్టకపోవచ్చు కానీ భారత్కు మీరు మద్దతివ్వాలి. ఇండియా పేరు పెట్టుకొని ఇండియాను అడ్డుకోరాదు అని విపక్షాలనుద్దేశించి రిజుజు అన్నారు. పేదోడి బిడ్డను విపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానించారు. విపక్షాలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎదురుదాడికి దిగారు. ఇది అవిశ్వాస తీర్మానం కాదని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పేదవాడి తనయుడికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన విశ్వాస రహిత ఓటన్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానం కాదని, విపక్ష కూటమి ‘ఇండియా’ భాగస్వాముల మధ్య విశ్వాస పరీక్ష అని వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ ఎంపీ సభ్యత్వ పునరుద్ధరణ అంశాన్ని కూడా దూబే ప్రస్తావించారు. రాహుల్ పార్లమెంటుకు వచ్చినా ఒరిగేదేమీ లేదని, ఆయన ఎప్పటికీ వీర్ సావర్కర్ కాలేరని వ్యాఖ్యానించారు. కొడుకుకు అధికారం, అల్లుడికి బహుమానం అనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి లేదని సోనియాగాంధీని ఉద్దేశించి అన్నారు.