ఓవైపు దేశం తీవ్ర ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. నిరంతరం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. నాలుగు రోజుల కిందట ఆయుధ ఫ్యాక్టరీల్లో కిమ్ పర్యటించి, ఈ సందర్భంగా ఆధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. తాజాగా, ఉత్తర కొరియా సైనిక జనరల్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, యుద్ధం వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలో ఉత్తర కొరియా శత్రువులను ప్రతిఘటించే ప్రణాళికలపై చర్చించిన సందర్భంగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారని, పేరు మాత్రం వెల్లడించలేదని నివేదిక పేర్కొంది. మిలిటరీ టాప్ జనరల్, జనరల్ స్టాఫ్ చీఫ్ పాక్ సు ఇల్ స్థానంలో రక్షణ మంత్రి జనరల్ రి యోంగ్ గిల్ను నియమించినట్టు నివేదించింది. దీంతో రక్షణ మంత్రిగా రీ యోంగ్ గిల్ కొనసాగుతారా? అనేది అస్పష్టంగా ఉంది. కిమ్ కూడా ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాని పేర్కొంది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మాత్రం నివేదిక బయటపెట్టలేదు. గత వారం ఏకధాటిగా మూడు రోజుల పాటు ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్.. మరిన్ని క్షిపణులు, మానవరహిత గగనతల వాహనాలు, ఇతర ఆయుధాలను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఎన్ఏ విడుదల చేసిన మ్యాప్ల ఫోటోల్లో కిమ్.. దక్షి కొరియా రాజధాని సియోల్, దాని పరిసర ప్రాంతాలను చూపుతున్నట్లు చూపించాయి. ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తోన్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందించిందని, అందులో ఫిరంగి షెల్లు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అమెరికా ఇటీవల ఆరోపించింది. వీటిని రష్యా, ఉత్తర కొరియా ఆ వాదనలను ఖండించాయి.
సైనిక దళాలను పోరాటానికి సిద్ధం చేయడానికి అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో డ్రిల్స్ నిర్వహించాలని కిమ్ పిలుపునిచ్చారని నివేదిక పేర్కొంది. కొరియన్ రిపబ్లిక్ 75వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1న ఉత్తర కొరియా మిలీషియా పరేడ్ను నిర్వహించనుంది. దీనికి ముందు ఆగస్టు 21 నుంచి 24 వరకూ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరగనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమ భద్రతకు ముప్పుగా భావిస్తోంది. దీంతో మరోసారి కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.