విశాలాంధ్ర-రాప్తాడు : దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 80 ఏళ్ళు నిండిన సందర్భంగా విద్యార్థుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కదిలింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాప్తాడు మండలంలోని గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు గురువారం క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ ర్యాలీని పాఠశాల కరస్పాండెంట్ సమీరకృష్ణభరత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టి నిర్వహించారు. ఎస్సై ఆంజనేయులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు నాటి సంగ్రామ కాలాన్ని, నాటి వీరుల స్ఫూర్తిని తలుచుకుంటూ నినాదాలు చేశారు. వీరుల త్యాగాలను తలచుకుంటూ నాటి విముక్త పోరాటంలో యోధుల స్ఫూర్తిని, వారిని మరోసారి స్మరించుకోవాలని సమీరకృష్ణభరత్ విద్యార్థులకు ఉద్బోధించారు. ఎన్నో అవమానాలు, బాధలు, దుఃఖాలు దాటుకుని సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం నేడు అందరి బాధ్యత అని అన్నారు. ఓ సమున్నత లక్ష్యంతో చేపడుతున్న ఇటువంటి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలకు ఓ గొప్ప నివాళి వంటివి అని, అదేవిధంగా వారిని గౌరవించుకునే తీరుకు ఇవి సంకేతంగా నిలుస్తాయన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, స్వాతంత్ర్య ఫలాలను చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న రాష్ట్రాల వేషధారణలతో, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల వస్త్రధారణలతో అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.