ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిన భారత్
నిరాశపరిచిన టీమిండియా బాట్స్మెన్
సిరీస్ 1`1తో సమం
లీడ్స్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లండ్ విజయంతో సిరీస్ను 1-1తో సమమైంది. 212/2 ఓవర్నైట్ స్కోర్తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఏ దశలోనూ పోరాట పటిమ కనపరచలేదు. మూడో రోజు టాపార్డర్ పోరాడినా నాలుగో రోజు కొత్త బంతి భారత్ను దెబ్బ కొట్టింది. తొలి సెషన్లోనే భారత్ వికెట్లన్నీ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే సెంచరీకి చేరువైన చేతేశ్వర్ పుజారా (91, 189 బంతుల్లో) ఓలి రాబిన్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ రివ్యూ కోరడంతో భారత్ పుజారాను కోల్పోయింది. కొంత సేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లి (55) రాబిన్సన్ బౌలింగ్లోనే స్లిప్లో కెప్టెన్ రూట్ చేతికి చిక్కాడు. పుజారా, కోహ్లీ ఔట్ అనంతరం భారత్ వికెట్ల పతనం మొదలైంది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. ప్రతిఒక్కరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (10), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (1), పేసర్లు మొహ్మద్ షమీ (6), ఇషాంత్ శర్మ (2), రవీంద్ర జడేజా (30), మొహమ్మద్ సిరాజ్(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. జస్ప్రీత్ బుమ్రా (1) నాటౌట్గా నిలిచాడు. చివరికి భారత్ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఓడిరది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలి రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా..క్రెయిగ్ ఓవర్టన్కు మూడు, జేమ్స్ అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు మూడో రోజు ఓపెనర్ రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా అర్ధ శతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దాంతో భారత్ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి 212/2 స్కోర్తో నిలిచి మ్యాచ్లో పోరాటం చేసేలా కనిపించింది. మరో రెండు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్న ఈ సిరీస్లో లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.