వాలంటరీల సంక్షేమ సంఘం చింతపల్లి మండల అధ్యక్షుడు పరమేశ్వరరావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- వాలంటరీల సమస్యలపై సమ్మె చేస్తామని వస్తున్న ప్రకటనలలో వాస్తవం లేదని వాలంటీర్ల సంక్షేమ సంఘం చింతపల్లి మండల అధ్యక్షుడు వేములపూడి పరమేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని లేని పక్షంలో నెలవారి పెన్షన్ ల పంపిణీని నిలిపివేస్తామని, అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె బాట పడతామని వస్తున్న కథనాలలో వాస్తవం లేదన్నారు.రాష్ట్ర, జిల్లా, మండల వాలంటరీలు అటువంటి కథనాలను నమ్మి ఆందోళనకు గురికావద్దన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలనుద్దేశించి వైకాపా ప్రభుత్వం
అంటే గిట్టని కొంతమంది ప్రతిపక్ష పార్టీల వారు వారి రాజకీయ భవిష్యత్తునుద్దేశించి కుట్ర పూరిత ప్రకటనలు చేస్తున్నారని గుర్తుంచుకోవాలని, అటువంటి మోసపూరిత కథనాలు చూసి మోసపోకూడదని వాలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. వేతనం పెంపు, ఉద్యోగ భద్రత విషయంలో వాలంటరీ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలమైన
ఆలోచన కలిగి ఉన్నారని, వాలంటీర్ల సమస్యలపై త్వరలో మంచి వార్త వెలువడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీ ల మధ్య ఐక్యతా భావం ఉందని దాన్ని
పాడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, ఇటువంటి కుతంత్రాలను తిప్పి కొట్టాలని వాలంటీర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించండి అంటూ అల్లూరి జిల్లాలో ఎటువంటి సమ్మెలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోలు నిర్వహించడం లేదని, సమస్యలుంటే నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి పరిష్కరించుకుంటామే తప్ప ఎన్నికల ముందు ఆందోళన లు చేపట్టి, వాలంటీర్లుగా అవకాశం కల్పించిన ప్రభుత్వంపై పోరుబాట పట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంపై వాలంటీర్లెవరు ఆందోళన చెందవద్దని, సమయపాలన పాటిస్తూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.