జిల్లా ఇంచార్జి కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, తదితర పథకాల అమలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జి కలెక్టర్ కేతన్ గార్గ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రభుత్వ పథకాల కింద నిర్వహించే కార్యక్రమల కోసం ముందుగానే షెడ్యూల్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని షెడ్యూల్ ని రూపొందించుకోవాలని, ఆయా కార్యక్రమాల్లో వారు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు వైఎస్సార్ పెన్షన్ కానుక కింద కార్యక్రమాలు నిర్వహించాలని, జనవరి 23వ తేదీన వైఎస్సార్ ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించడం జరుగుతుందని, చేయూత కింద 5 నుంచి 14వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలని, ఆయా పథకాల కింద మండల, గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో ఎక్కడ పొరపాట్లు జరగకూడదన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, మెప్మా పిడి విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, డిటిడబ్ల్యూఓ అన్నాదొర, బీసీ వెల్ఫేర్ ఈడి సుబ్రహ్మణ్యం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.