డీఎఫ్ఓ సూర్యనారాయణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):-వృక్ష సంపదను కాపాడి పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ డివిజనల్ అధికారి సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి ఎల్ బి కే పాత్రుడు, డిప్యూటీ రేంజ్ అధికారి వెంకటరాజు ల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ పరిధిలోని రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఏపీజే ఎఫ్ ఓ చింతపల్లి డివిజన్ యూనిట్ సభ్యులు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, ఆ శాఖ బీట్ అధికారులు, సిబ్బంది, అటవీ శాఖ డివిజనల్ అధికారి సూర్యనారాయణకు పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు వృక్ష సంపదను కాపాడడంతోపాటు పర్యావరణాన్ని పరి రక్షించేందుకు కృషి చేయాలన్నారు ఈ క్రమంలో వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. వనాలు ఉంటేనే వర్షాలు పుష్కలంగా కురుస్తాయని తద్వారా పంటలు పుష్కలంగా పండి జనాలు ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు దోహద పడతాయన్నారు. వృక్ష సంపదను పెంచడం వలన పుష్కలమైన ప్రాణవాయువు లభిస్తుందని, కరోనా సంక్షోభ సమయంలో నగరాలు, పట్టణాలలో ప్రాణవాయువు కొరతతో అనేకమంది మృత్యువాత పడిన సంఘటనలను మనం చూసామన్నారు. అటువంటి పరిస్థితి మన్య ప్రాంతంలో లేకపోవడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలన్నారు. అనంతరం సిబ్బందితో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డి ఎఫ్ ఓ ఎన్ ఎస్ బి రాజు, చింతపల్లి, మర్రిపాకలు పెదవలస, సీలేరు, రేంజ్ అధికారులు ఎల్బీకే పాత్రుడు, బి వి కే వర్మ, కే జగదీశ్వరరావు, కే శ్రీనివాసరావు, ఏపీజే ఎఫ్ఓ చింతపల్లి డివిజన్ యూనిట్ సభ్యులు, ఎఫ్ ఎస్ ఓ లు, ఎఫ్ బి ఓ లు, సిబ్బంది పాల్గొన్నారు.