స్వలాభాపేక్షతోనే పార్టీ ఫిరాయింపు
ఎర్ర బొమ్మల సర్పంచ్ పండయ్య
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్వలాభాపేక్షతో పార్టీ ఫిరాయించే వారికి వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అగుపించలేదా అని ఎర్రబొమ్మల సర్పంచ్ లోతా పండయ్య అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు లేవని, అభివృద్ధి కుంటుపడిందని లేనిపోని అబాండాలు వేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే కొంతమంది సర్పంచులు, నాయకులు తమ స్వార్థ, సుప్రయోజనాల కోసమే ఆలోచన చేసి వైకాపా ప్రభుత్వంపై లేనిపోని నిందారోపణలు చేయడం తగదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క సచివాలయానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడాన్ని సర్పంచ్ లు మరిచారా అని ఆయన ప్రశ్నించారు. అదే క్రమంలో 40 లక్షల రూపాయల నిధులు వెచ్చించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టడం, గ్రామాలలో సిమెంటు రహదారుల నిర్మాణం, త్రాగునీటి కల్పన, మారుమూల గ్రామాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రహదారులు, సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న విషయం మరిచారా అని ఆయన ప్రశ్నించారు. గడచిన నాలుగున్నర ఏళ్ళుగా ఇటువంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు నిర్వహించి ప్రజల చెంతకే పరిపాలనను తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైకాపా అని ఆయన గుర్తు చేశారు. గతంలో పరిపాలించిన అనేక ప్రభుత్వాలు అభివృద్ధిని గాక ప్రజల సంక్షేమాన్ని కూడా విస్మరించిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పేద, బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీల సంక్షేమానికి కృషిచేసిన వైకాపా ను వీడి స్వప్రయోజనాలు, స్వలాభాపేక్షతోనే కొంతమంది సర్పంచ్లు, నాయకులు వైకాపా పై నిందారోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి విధానాలు మానుకోకపోతే రాబోవు స్థానిక ఎన్నికలలో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమన్వయకర్తల మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అందులో భాగంగానే సమన్వయకర్తల మార్పు చేర్పులు జరుగుతున్నాయని, పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గాలు అనేవి లేకుండా సమన్వయంతో పనిచేసి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో అన్ని స్థానాలలో వైకాపా అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు.