– చెరకు రైతుల బకాయిలకు ఉద్యమించాలి …..
ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు …
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.09.01.2024ది. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోపోతే మనుగడ కష్టమని ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు తెలిపారు. కోనసీమ జిల్లా రాజమహేంద్రవరం లో ఈ నెల 8,9,10 తేదీల్లో జరుగుతున్న ఏ.పి. రైతు సంఘం (ఏ.ఐ.కె.ఎస్) 18వ రాష్ట్ర మహాసభలో అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు పాల్గొని, మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతాంగం 75 శాతానికి పైగా వరి, చెరుకు పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సుగర్ ఫ్యాక్టరీలకు, ఇప్పటికే మూడు సుగర్ ఫ్యాక్టరీలు మూసి వేయడంతో మిగిలిన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం, పాలకుల వైఫాల్యాలతో నష్టాలు ఊబిలోకి తీసుకెళ్లి ఫ్యాక్టరీ మూసివేసే పరిస్థితులు దాపురించాయి అన్నారు. గతేడాది చెరకు బకాయిలను నేటికీ ఇవ్వకుండా చెరకు క్రషింగ్ మొదలు పెట్టారు అని తెలిపారు. క్రషింగ్ చేసే పద్ధతిలో తగిన చర్యలు చేపట్టడంలో యాజమాన్యం, విఫలమవుతోందన్నారు. అధికార పార్టీలో ఉన్న పాలకులు చోడవరం షుగర్ ఫ్యాక్టరీను నష్టాలు ఊబిలోంచి, బయటికి తీసి రైతులకు పేమెంట్లు జరుపుతామన్నారని, గత జనరల్ బాడీ సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడులు ఆర్భాటంగా వాగ్దానాలు చేసి, నేటికీ కూడా రైతులకు పేమెంట్ జరగకుండా నిర్వీర్యంచేస్తున్నారు అని తెలియజేశారు. రాష్ట్ర యావత్తు రైతులు, అనుబంధ ప్రజా సంఘాలు రైతాంగం, షుగర్ ఫ్యాక్టరీ సమస్యల పైన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాతల ఆర్తనాదాలు ప్రభుత్వానికి జ్ఞానం కలిగే విధంగా రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని మహాసభలో ప్రస్తావన చేశారు.