మైదానంలో వెటరన్ క్రికెటర్ ఫీల్డింగ్ చేస్తుండగా.. పక్కనే ఉన్న మరో పిచ్ నుంచి బంతి ఎగిరివచ్చి తలను తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు. విషాదకర ఈ ఘటన ముంబయిలోని మాతుంగా దాద్కర్ మైదానంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దాదర్ పార్సీ కాలనీ స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్లో జయేష్ సవాలా.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని చెవి వెనుకకు తగిలిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కిందపడిపోయిన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జయేశ్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కుచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్లో భాగంగా 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. స్థానిక టోర్నమెంట్లకు స్థలబావంతో ఒకే మైదానంలో పక్క పక్కనే ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు సాధారణంగా నిర్వహిస్తుంటారు. ఈ టోర్నీలోనూ ఒకే మైదానంలో రెండు వేర్వేరు మ్యాచ్లు ఒకేసారి నిర్వహించారు. ఈ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లకు గాయాలైన ఘటనలు ఇంతకు ముందు చోటుచేసుకున్నప్పటికీ ప్రాణాపాయం జరగడం ఇదే మొదటిసారి. దీనిపై ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం తరలించారు. అయితే, ఎటువంటి కుట్రలేదని పేర్కొన్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సాయంత్రం 5 గంటల సమయంలో సవాలా మృతి చెందినట్లు లయన్ తారాచంద్ ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు.