విజయవాడ సీతారామపురంలోని శ్రీ సెవెన్హిల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. భోగిమంటలు, రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో పాఠశాల ముంగిటనే కాకుండా శ్రీనివాసరావు వీధి అంతా పండగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ వస్త్రధారణతో కనుమరుగవుతున్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టుగా విద్యార్థులు ప్రదర్శించిన కళా నైపుణ్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని అబ్బురపరిచింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థినులు వేసిన రంగవల్లులు మరింత ఆకట్టుకున్నాయి. విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరిస్తూ, ఈ పండుగలను సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా పేర్కొన్నారు.