ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ డి.మురళీధర్ రెడ్డి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఫిర్యాదులను పారదర్శకంగా పరిశీలించాలని, ఎలాంటి తప్పులు లేకుండా ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ డి.మురళీధర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్.(వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయముల అభివృద్ది సంస్థ, ఆంధ్రప్రదేశ్) ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – 2024 లో భాగంగా వివిధ అంశాలపై ఈఆర్ఓలతో శనివారం మూడవ విడత జిల్లాకు విచ్చేసిన ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ డి.మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రి దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో గురించి రోల్ అబ్జర్వర్ ఆరా తీశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన ఫిర్యాదులు పరిష్కరించారా, ఫిర్యాదులను విచారణ చేసి నిజమైనవి అని తేలితే తుది ఓటర్ల జాబితాలో తొలగించారా లేదా, తదితర అంశాలపై ఆరా తీశారు. క్లయిమ్స్ పరిష్కారానికి సంబంధించిన రిపోర్ట్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ క్లయిమ్లను పరిష్కరించే క్రమంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనవసరమైన ఫిర్యాదులకు తావివ్వకుండా గతేడాది డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లైములు, డిసెంబర్ 10వ తేదీ నుంచి వచ్చిన ఫిర్యాదులను పారదర్శకంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల కమీషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల తుది జాబితాను ఈనెల 22వ తేదీన బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రచురణ జరగాలన్నారు. అదే రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి రెండు సెట్ల ఓటర్ల జాబితాను అందజేయాలని ఆదేశించారు. ప్రతి అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సమాచారం అందజేయాలన్నారు. ఓటర్లకు ఇబ్బంది కాకుండా ఒకే లొకేషన్ లో నాలుగుకు మించి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయరాదని, ఇందుకు సంబంధించి సమగ్రమైన నివేదికను తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవంపై ఆరా తీశారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణిసుస్మిత, ఈఆర్ఓలు సుధారాణి, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, కరుణకుమారి, వెంకటనారాయణమ్మ, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.