ఆరోపిస్తున్న జోహార్ గ్రామస్తులు
విశాలాంధ్ర – చింతపల్లి( అల్లూరి సీతారామరాజు జిల్లా):- మండలంలోని మారుమూల పంచాయతీ అయిన బలపం పంచాయతీ జోహారు గ్రామంలో పాఠశాల నూతన భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచి పోవడంతో ఆ గ్రామంలో పాఠశాల లేక విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారు. తమ గ్రామం ఏర్పడి 8 దశాబ్దాలు గడిచి తరాలు మారుతున్నా, తమ తల రాతలు మారలేదని గ్రామంలోని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 ఏళ్లు పూర్తి చేసుకుని 77 వ వసంతం లోకి అడుగు పెడుతున్నామని గొప్పగా ప్రచారం చేసుకోవడం మినహా మారుమూల ప్రాంతాల్లో ఆ స్వాతంత్ర్య ఫలాలు గానీ, మానవాళికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని చెప్పక తప్పదు. పంచాయతీ కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోహార్ గ్రామానికి నేటికీ సరైన రహదారి, రవాణా, విద్య, వైద్యం, రక్షిత త్రాగునీరు వంటి కనీస మౌలిక వసతులు లేవంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో వైకాపా ప్రభుత్వ నాడు నేడు పేరిట పాఠశాల నూతన భవనానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రభుత్వ కాలపరిమితి పూర్తి కావస్తున్నా, ఈ గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం పిల్లర్ ల స్థాయిలోనే అసంపూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న రేకుల షెడ్ లో పాఠశాల నిర్వహణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యకు నోచుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి జోహారు గ్రామంలో పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అదే క్రమంలో గ్రామానికి సరైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు