అంతర్ల, పెంటపాడు గ్రామాలలో బాబు షూరిటీ… భవిష్యత్తు గ్యారెంటీ కార్డుల నమోదు.
తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచందర్రావు.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలతో ప్రజలను మభ్య పెట్టారని రాబోవు సార్వత్రిక ఎన్నికలలో ఆ ప్రభుత్వాన్ని ఓటు అనే అస్త్రంతో తరిమికొట్టాలని తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచందర్రావు అన్నారు. అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం తో కలిసి అంతర్ల, పెంటపాడు తదితర గ్రామాలలో బాబు షూరిటీ…భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేసిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ నిర్మూలన కృషి చేస్తానని, అదేవిధంగా ప్రజలకు, అంగన్వాడీలకు ఎన్నో మేలులు చేస్తానని అమలు సాధ్యం కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక నవరత్నాలు పేరిట నవ మోసాలు చేశాడన్నారు. సంక్షేమ పథకాల పేరిట సర్వం దోచుకుని బటన్ రెడ్డి గా మారాడన్నారు. నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి మరో మారు అధికారం చేపట్టాలని చూస్తున్న వైకాపాను నమ్మి మోసపోవద్దని యువతకు సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిన వైకాపా సర్కారు అడ్డదారులలోనైనా సరే మరో మారు అధికారం చేపట్టాలని చూస్తుందని దీన్ని ప్రజలంతా గమనించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, బేత నాగు, కొర్ర గోవింద్, గొల్లూరి మంగు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.