నరకప్రాయంగా తయారైన మన్యం రహదారులు
పాలకులు, అధికారులకు పట్టని రహదారుల దుస్థితి
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్యం రహదారులు నరకప్రాయంగా తయారయ్యాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఏ రహదారి చూసిన గతుకులమయమే. కనీసం రహదారులు భవనముల శాఖ అధికారులు ఆ గతుకులకు అతుకులు వేసిన పాపాన పోలేదంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం మన్యం రహదారులు సమస్తం వైకాపా పరిపాలనలో గుంతలమయం. వాహనాలు తిరగాలన్నా, కాలినడకన ప్రయాణించాలన్న కష్టమే. రాళ్లు తేలిన రహదారులు, దుమ్ము లేచిపోతూ పేరుకుపతున్న మట్టి కారణంగా కనిపించని గుంతల కారణంగా జరుగుతున్న ప్రమాదాలు. ఈ రహదారుల గుండా ప్రతి రోజూ నాయకులు, అధికారులు తిరుగుతున్నా ఏ ఒక్కరికీ పట్టని సమస్య ఇది. గడచిన ఐదేళ్లుగా గోతులతో నిండి ఉన్నా ఈ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తాగిస్తుంది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ చిన్న కొత్తపాలెం, కడశిల్ప గ్రామల మధ్య నున్న రహదారి సమస్య జటిలంగా ఉందని ఆయా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పర్యాటకులు మండలంలోని ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, తాజగి చెరువుల వేనం పర్యాటక ప్రాంతాలతో పాటు జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతానికి నిత్యం ఈ రహదారి మీదుగానే ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి రహదారి నేడు పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కనిపిస్తుంది. అధ్వానంగా తయారైన మన్యం రహదారుల్లో ప్రయాణికులు మాత్రం నరకం చూస్తున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటువంటి రహదారులపై ప్రయాణిస్తే అనతి కాలంలోనే వాహనాలు మూలకు చేరడం ఖాయమని, ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఉన్నాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అటు నాయకుల్లోనూ.. ఇటు అధికారుల్లోనూ ఎటువంటి చలనం లేకపోవడం గమనార్హం. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ తిరిగే వైకాపా నాయకులు ప్రజాప్రతినిధులు రోడ్డుకు అంటూ తిరిగితే రహదారి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయేమోనని మన్యప్రాంతవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.