జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకోసం జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో ఉన్న కే.ఎస్.ఆర్ బాలికల జూనియర్ కళాశాల వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవము సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నెల రోజులపాటు నిర్వహించడం జరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు అతివేగంగా డ్రైవ్ చేయడం జరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా, ఫోర్ వీలర్స్ వాహనదారులు సీట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారని, అవగాహన కల్పిస్తున్నా తెలిసి కూడా తప్పిదాలు చేస్తున్నడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రాణం విలువ ఎంతో గొప్పదని, కుటుంబమంతా ఒకరిపైనే ఆధారపడి ఉంటారని, ఒక చిన్న తప్పిదం ద్వారా కుటుంబాలు ఇబ్బందులు పడడం ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించాలని, భద్రతపై మరింత అవగాహన కల్పించాలని రహదారులు మరియు భవనాల శాఖ అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. హెల్మెట్ వాడడం వల్ల కలిగే ఉపయోగాలు, దానిద్వారా ప్రమాద తీవ్రత ఏ విధంగా తగ్గించుకోవచ్చు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చునారు. రహదారి భద్రతపై జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, ఆర్డీఓ జి.వెంకటేష్, డిటిసి వీర్రాజు, ఐ.అండ్.పిఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, రహదారుల శాఖ సిబ్బంది, పెద్ద ఎత్తున వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.