. నేడు గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె
. రైతు, కార్మిక సంఘాల సమాయత్తం
న్యూదిల్లీ : రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత గ్రామీణబంద్, పారిశ్రామికకు సర్వసిద్ధం చేశాయి. రైతు సంఘాలన్నీ ఏకమై భారత్ బంద్లో పాల్గొనాలని ఐక్య కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసనలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో పంజాబ్లోని కొన్ని రాష్ట్ర, జాతీయ రహదారులు శుక్రవారం నాలుగు గంటల పాటు మూసివేయనున్నారు. ఈ ఆందోళనకు దేశంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలతోపాటు అనుబంధ సంఘ కార్మికులు కూడా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. భారత్ బంద్ నేపథ్యంలో వివిధ ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూతపడనున్నాయి. దీంతో పాటు రవాణా, వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పనులు, గ్రామీణ పారిశ్రామిక, సేవా రంగ సంస్థలు, మూతపడే అవకాశం ఉంది. భారత్ బంద్ రోజున కూరగాయలు, ఇతర పంటల సరఫరాపైనా ప్రభావం పడుతుంది. భారత్ బంద్ సందర్భంగా అంబులెన్స్, పెళ్లిళ్లు, మెడికల్ షాపులు, పాఠశాలలు, పరీక్షలు తదితర అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చాయి. అయితే పంటలకు కనీస మద్దతు ధర, కొనుగోలుకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ, విద్యుత్ బిల్లు నిలుపుదల వంటి డిమాండ్లు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. దీంతోపాటు గృహావసరాలకు, దుకాణాలకు వ్యవసాయానికి ఉచితంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సమగ్ర పంటల బీమా, నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అందుకే ఈ ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని రైతులు స్పష్టంచేశారు.