పోలీస్ చర్యలను నిరసిస్తూ రైల్రోకో
పంజాబ్లో నిలిచిన రైళ్లు…దారి మళ్లింపు
టోల్ ప్లాజాల వద్ద ఆందోళన
న్యూదిల్లీ: పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధ భరోసా సహా వివిధ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేపట్టిన ‘దిల్లీ చలో’ ఆందోళన మూడోరోజుకు చేరింది. గురువారం పంజాబ్లో రైతులు రైలో రోకో నిర్వహించారు. ‘దిల్లీ చలో’ నిరసనకారులపై హరియాణా పోలీసుల చర్యను నిరసిస్తూ వారు ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు. పంజాబ్లో వివిధ ప్రాంతాల్లో రైతులు రైలు ట్రాక్లపై బైఠాయించడంతో దిల్లీ -అమృత్సర్ మార్గంలో గురువారం కొన్ని రైళ్లను దారి మళ్లించారు. రైతులు అనేక టోల్ ప్లాజాల వద్ద ధర్నాలు కూడా నిర్వహించారు. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయవద్దని అధికారులను అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్), బీకేయూ దకుండ (ధనేర్) పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు గంటలపాటు ‘రైల్ రోకో’ నిరసనకు పిలుపునిచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రైతులు రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగాయి. ప్రధానంగా దిల్లీ-అమృత్సర్ మార్గంలో అనేక ప్రదేశాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని ఉండడంతో రైల్వే అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లను చండీగఢ్ (దిల్లీ వైపు), లోహియాన్ ఖాస్ (అమృత్సర్, జలంధర్ వైపు) మీదుగా మళ్లించారు. దిల్లీ నుండి వచ్చే శతాబ్ది, షాన్-ఎ-పంజాబ్ ఎక్స్ప్రెస్ రైళ్లను లుధియానా రైల్వే స్టేషన్లో ఆపేసినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు. కాగా ‘చలో దిల్లీ’ కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై హరియాణా పోలీసు భాష్పవాయువును ప్రయోగించడాన్ని నిరస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు అనేక టోల్ ప్లాజాల వద్ద రైతులు ప్రదర్శనలు నిర్వహించారు. వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయరాదని అధికారులను ఒత్తిడి చేశారు. దిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు హర్మిత్ సింగ్ కడియన్ తెలిపారు. హోషియార్పూర్లో, జలంధర్-పఠాన్కోట్ జాతీయ రహదారిపై ఉన్న రెండు టోల్ ప్లాజాల వద్ద రైతులు నిరసనలు