. మా డిమాండ్లు ఆమోదించాల్సిందే
. లేకుంటే యథావిథిగా ‘దిల్లీ చలో’
. రైతు నేతల హెచ్చరిక
. నేటి ఉదయం 11గం.ల వరకు డెడ్లైన్
చండీగఢ్ : కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు, ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. బుధవారం (ఫిబ్రవరి 21) ఉదయం 11గంటల లోగా, ప్రభుత్వం స్పందించకపోతే తాము తలపెట్టిన ‘దిల్లీ చలో’ కార్యక్రమం యథా విధిగా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. గడువు ముగిసిన తర్వాత దిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు వెల్లడిరచారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ, వ్యవసాయ రుణాల మాఫీ సహా తమ డిమాండ్లను కేంద్రం ఆమోదించాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ డిమాండ్ చేశారు. వచ్చే ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు సోమవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంఎస్పీపై కేంద్రం ప్రతిపాదన రైతుల ప్రయోజనాలు నెరవేరవని రైతుసంఘాల నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం పంజాబ్`హర్యానా మధ్య శంభు సరిహద్దు పాయింట్ వద్ద కిసాన్ మజ్దూర్ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నపంథేర్ విలేకరులతో మాట్లాడుతూ…
‘మమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతులతో చర్చల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే దిల్లీ వైపు వెళ్లేందుకు అనుమతించాలి. మేము దిల్లీ వైపు వెళ్లినప్పుడు కాల్పులు జరిగాయి. ట్రాక్టర్ల టైర్లకు కూడా బుల్లెట్లు తగిలాయి. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇలాంటి వాటిని ప్రయోగించే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తప్పుడు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం హర్యానా పరిస్థితి కశ్మీర్లా తయారయ్యింది. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కు తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అని హెచ్చరించారు. రైతులకు మూడు పెద్ద డిమాండ్లు (అన్ని పంటలకు ఎంఎస్పీపై చట్టపరమైన హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు ‘‘సి2 ప్లస్ 50శాతం’’ ఫార్ములా అమలు, రుణ మాఫీ) ఉన్నాయన్నారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ… పార్లమెంటును ప్రత్యేకంగా సమవేశపర్చడం ద్వారా ఎంఎస్పీపై చట్టాన్ని రూపొందించాలని కేంద్ర మంత్రులతో జరిగిన నాలుగో విడత చర్చల్లో ప్రతిపాదించినట్లు పంథేర్ తెలిపారు. రుణమాఫీ అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నివేదికల ప్రకారం రైతులపై మొత్తం రూ.18.5 లక్షల కోట్ల మేర అప్పు ఉందన్నారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించామని… దానికి సంబంధించిన విధివిధానాలను తర్వాత రూపొందించవచ్చని చెప్పామన్నారు.
‘మోదీ బలమైన ప్రధాని అని మేమూ ఒప్పుకుంటాం!’
అంతేకాకుండా రైతుల అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు సర్వాన్ సింగ్ పంథేర్. తాజాగా చేసిన ప్రతిపాదనల వల్ల కేంద్రం అసలు రంగు బయటపడిరదని అన్నారు. కనీస మద్దతు ధరపై చట్టం తెస్తే, ప్రభుత్వం దిగుమతులపై చేసే ఖర్చు కంటే తక్కువ ధరకే పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయొ చ్చని నిపుణులు చెబుతున్నారని అన్నారు. నరేంద్ర మోదీ బలమైన ప్రధాని అని బీజేపీ చెబుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, మోదీ బలమైన ప్రధాని అని రైతులు కూడా అంగీకరిస్తారని పంథేర్ తెలిపారు.
‘ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి’
5 పంటలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని నిపుణులు అంటున్నారని పంథేర్ తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు ఆ కాంట్రాక్టు పరిధిలోకి రారని, అంతేకాకుండా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదన్నారు. సరైన చట్టం లేకపోవడం వల్ల దోపిడీ జరుగుతోందన్న పంథేర్… ఎమ్ఎస్పీ చట్టం ద్వారా దీన్ని నియంత్రించవచ్చని తెలిపారు. కానీ కార్పొరెట్ శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయన్నారు. కాగా కొనసాగుతున్న నిరసనలో ఇద్దరు రైతులు మరణించిన విషయంపై మాట్లాడుతూ… పంజాబ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక విధానాన్ని ప్రకటించాలన్నారు. మరణించిన వారి కుటుంబానికి పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పంథేర్ డిమాండ్ చేశారు. ఖానౌరీ సరిహద్దు పాయింట్ వద్ద నిరసనలో భాగమైన 72 ఏళ్ల రైతు ఆదివారం గుండెపోటుతో మరణించాడు. అంతకుముందు శంభు సరిహద్దులో 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిషేధించడం సరికాదన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని పంథేర్ అన్నారు. మరో రైతు నాయకుడు అశోక్ బులారా మాట్లాడుతూ… స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన ‘‘సి2 ప్లస్ 50 శాతం’’ ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఎంఎస్పీపై చట్టాన్ని రూపొందించాలని, వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని అన్నారు. తమ డిమాండ్లయినా ఆమోదించాలి లేదా తాము శాంతియుతంగా దిల్లీకి ప్రదర్శన చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ‘‘దిల్లీ చలో’’ మార్చ్కు నాయకత్వం వహిస్తున్నాయి.