. సంక్షోభంలో హిమాచల్ కాంగ్రెస్ సర్కార్
. ముగ్గురు పరిశీలకులను పంపిన అధిష్ఠానం
. బీజేపీ ప్రజా తీర్పును అణచివేస్తోందని ధ్వజం
. మంత్రి విక్రమాదిత్య రాజీనామా
. అసెంబ్లీ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
. ఐదేళ్లూ మేమే ఉంటామని సీఎం సుఖు ధీమా
న్యూదిల్లీ/సిమ్లా:
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ…బీజేపీ ‘ఆపరేషన్ కమలం’కు పదునుపెట్టింది. కేంద్రంలో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో సైతం ఎంపీలు సీట్లు దక్కించుకునేందుకు, ఆయా రాష్ట్రాల్లో విపక్ష పాలిత ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నుతోంది. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసింది. రాష్ట్రంలో ఏకైక స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందాడు. అనంతర పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభానికి దారితీశాయి. క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిరదని, సీఎం సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ నేత జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత కష్టాల్లో పడిరది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు బుధవారం బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ప్రతిపక్ష నాయకుడు జై రామ్ ఠాకూర్ ఉదయం 7.30 గంటలకు రాజ్భవన్కు ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లారు. ఆర్థిక బిల్లును విభజన ద్వారా మాత్రమే ఆమోదించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జై రామ్ ఠాకూర్ సహా 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. స్పీకర్ను అగౌరవపరిచినందుకు వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ సభా వ్యవహారాల మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే బీజేపీ సభ్యులు అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత బీజేపీ సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో ఆర్థిక బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీంతో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా సభను వాయిదా వేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభ నివారణకు ఆ పార్టీ చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నందున, అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, తమకు ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవించేలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బుధవారం భూపేశ్ బఘేల్, భూపిందర్ సింగ్ హుడా, డి.కె.శివకుమార్ను సిమ్లాకు పంపారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలందరితోనూ మాట్లాడి సమగ్ర నివేదికను తనకు త్వరగా సమర్పించాలని రాష్ట్ర పరిశీలకులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లాను ఖడ్గే కోరారు. ‘బీజేపీ ఆపరేషన్ కమలం’ ద్వారా మేము ప్రజల తీర్పును కోల్పోబోమని, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మాత్రమే దానిని వెనక్కి తీసుకోగలరు’ అని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ ఇంతకుముందు మధ్య ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో చేసిందని విమర్శించింది.
రాష్ట్రంలో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పష్టం చేశారు. ‘పార్టీ అధిష్ఠానం నన్ను లేదా మరెవరినీ రాజీనామా చేయమని అడగలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన పని. వారు తమ సొంత వాళ్లను నమ్మడం లేదు.. సీఆర్పీఎఫ్ను మోహరించారు.. హర్యానా పోలీసులను మోహరించారు.. హెలికాప్టర్ను ఉపయోగించారు’ అని తెలిపారు. అయితే హిమాచల్ ప్రజలు మా వెంటే ఉన్నారని, ఎమ్మెల్యేలు మాతో ఉన్నారని, ఐదేళ్లపాటు హిమాచల్ ప్రభుత్వాన్ని మేమే నడుపుతామని కచ్చితంగా చెప్పగలను అని సుఖు అన్నారు. ప్రస్తుత పరిస్థితికి ‘ఆపరేషన్ కమలం’ కారణమా లేక ‘సొంత మనుషులు’ కారణమా అని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ… ‘కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఆ తప్పుల వల్ల కొన్ని లోపాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ ‘ఆపరేషన్ కమలం’లో ఉపయోగించిన ‘తంతర్-మంతర్’ రకం దానిలో పెద్ద (పాత్ర) కలిగి ఉంది’ అని కూడా అన్నారు. మంగళవారం జరిగిన ఓటింగ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు 34 ఓట్లు రాగా, కనీసం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లాట్ల డ్రా ఆధారంగా ఫలితాలను ప్రకటించామని అధికారులు తెలిపారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రులు ఉన్నారు.