పశ్చిమ బెంగాల్లో నిర్మించిన దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మెట్రోను ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ మొదట హుగ్లీ నది కింది నుంచి రైలులో ప్రయాణించారు. దేశంలోనే తొలి మెట్రో అందుబాటులోకి వచ్చిన కోల్కతా నగరంలోనే తాజాగా అండర్ వాటర్ మెట్రో కూడా ప్రారంభం కావడం గమనార్హం.
అండర్ వాటర్ మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ.. అందులో తొలి ప్రయాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కొందరు స్కూలు విద్యార్థులు కూడా అదే మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. ఎస్ప్లనేడ్ నుంచి హావ్డా మైదాన్ స్టేషన్ వరకు ప్రయాణించిన ప్రధాని మోదీ వెంట.. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ఉన్నారు. ఈ క్రమంలోనే అండర్ వాటర్ మెట్రో రైలు విశేషాలను అధికారులు మోదీకి వివరించారు.
కోల్కతా మెట్రోలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా నిర్మించిన ఈ అండర్ వాటర్ టన్నెల్ ఎస్ప్లనేడ్ మెట్రో స్టేషన్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ఉంది. అయితే దేశంలో తొలి మెట్రో రైలు 1984 లోనే కోల్కతాలో పరుగులు తీయగా.. తాజాగా అండర్ వాటర్ టన్నెల్ మెట్రో కూడా కోల్కతాలోనే ప్రారంభం కావడం విశేషం. రూ.120 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్ను హుగ్లీ నది కింద నిర్మించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్ల పొడవున మెట్రో భూమి కింద ఉంటుంది. ఈ మార్గంలో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో 520 మీటర్ల పొడవైన అండర్వాటర్ మెట్రో టన్నెల్ను నిర్మించారు. ఇది హుగ్లీ నదిని 45 సెకన్లలో దాటేస్తుంది.
ఈ అండర్ వాటర్ టన్నెల్ను అత్యాధునిక టెక్నాలజీతో ప్రకృతి విపత్తులను కూడా తట్టుకునేలా నిర్మించారు. బ్రిటన్కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఈ టన్నెల్ నిర్మించారు. ప్రస్తుతం హౌరా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుండగా.. ఈ అండర్వాటర్ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈ మార్గంలో రోజూ దాదాపు 7 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం నుంచి నదీ గర్భం నుంచి ప్రయాణికులను అనుమతిస్తామని కోల్కతా మెట్రో రైల్ సీపీఆర్వో కౌశిక్ మిత్రా స్పష్టం చేశారు. హౌరా మైదాన్ – ఎస్ప్లనేడ్ మార్గంలో మొత్తం హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ 3 స్టేషన్లు ఉన్నాయి. దేశంలోనే ఒక నది కింద నిర్మించిన అతి పెద్ద టన్నెల్ ఇదే కాగా.. ఈ మార్గంలో ఉన్న హౌరా మెట్రో స్టేషన్ భారత్లోనే అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్గా రికార్డుల్లోకి ఎక్కింది. నీటి అడుగున 16 మీటర్ల లోతులో నిర్మించిన టన్నెల్ గుండా మెట్రో రైళ్లు పరిగెత్తనున్నాయి.