ప్రకృతివ్యవసాయ పంటలు రైతుల ఆరోగ్యానికి ఎంతోమేలు
విశాలాంధ్ర,పార్వతీపురం: ప్రకృతి వ్యవసాయంచేస్తున్న రైతులు విజయం సాధిస్తున్నారని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్డ్ పాల్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వ్యవసాయశాఖ, రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతునుండి వినియోగదారునికి నేరుగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా రాబర్డ్ పాల్ మాట్లాడుతూ పల్లెలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే వ్యవసాయమే కారణమన్నారు. నేడు రైతులు ప్రకృతివ్యవసాయం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.ప్రకృతి వ్యవసాయం,ప్రకృతి సేద్యం గత కొంత కాలంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు,
ప్రకృతి వ్యవసాయంచేయడంతో అధిక దిగుబడితోపాటు లాభాలు ఆర్జిస్తున్నారన్నారు.
ప్రకృతివ్యవసాయం అతితక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. గోఆధారిత సహజ ఎరువులు, మిశ్రమాలతో, ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు, నూనెలు తయారు చేసుకుని, భూసారాన్ని పెంచుకుంటూ, చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన రసాయన రహిత ఆహారాన్ని రైతులు అందిస్తున్నారని వివరించారు.
ఈశిభిరంలో రైతులు ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పండించిన బియ్యం, మిల్లెట్స్,బెల్లం,కూరగాయలు మొదలైనవి విక్రయిస్తారన్నారు. వీటిని కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలని కోరారు .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వివిధ పథకాలు ప్రకటించాయని, వివిధ శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆచరించాల్సిన ముఖ్య విధానాలను అమలులోకి తెచ్చిందని రాబర్డ్ పాల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎపిసిఎన్ఎఫ్ జిల్లా అధికారి పి. షణ్ముఖరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది , ఏపీసిఎన్ఎఫ్ సిబ్బంది,ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.