మర్ల విజయకుమార్
ఈ మహా విశ్వంలో లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం ఇప్పటివరకు ఈ మహావిశ్వంలో 5% కూడా శోధించలేదు. అంటే ఈ విశ్వం గురించి మనకు తెలిసినది అతి తక్కువ మాత్రమే! మన సూర్యుడు పాలపుంతలోని లక్షల నక్షత్రాలలో ఒకటి. సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో ఒక్క భూమిపైననే జీవం ఉన్నట్లుగా ఇప్పటి పరిశోధనలు బట్టి మనం నిర్ధారణగా చెప్పవచ్చును. మనం ఉన్నాము గనుక ఈ భూతలంపై మనతోబాటు లక్షలాది రకాల జీవులు కూడా నివసిస్తున్నాయి కనుక భూమిపైననే జీవం ఉన్నదని రూఢ అవుతున్నది. మార్క్స్ చెప్పినట్లుగా వస్తువుల బాహ్య లక్షణాలు, వాటి అంతర్గత లక్షణాలు ఒకటే అయితే ఇక సైన్స్తో పనిలేదు. శాస్త్రజ్ఞులు భూమిపైన ఇంత జీవ వైవిధ్యం ఉంటే, ఇతర గ్రహాల పైన కూడా జీవం ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. ‘‘అసలు ఏదేని ఒక గ్రహం పైన జీవం ఉద్భవించటానికి అనుకూల పరిస్థితులు ఏమిటి’’ అనే ప్రశ్నను వేసుకుని పరిశోధన ప్రారంభించారు.
మొదటగా ఆ గ్రహంపైన జీవులు ఉద్భవించటానికి అనువైన వాతావరణం ఉండాలి. భూమిపైన -100 డిగ్రీల నుండి 0100డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగిన వివిధ రకాల జీవులు ఉన్నాయి. భూ ఉపరితలంపైన ఉండే సాధారణ వాయు ఒత్తిడి నుండి, సముద్రగర్భంలో దానికి అనేక రెట్ల ఎక్కువ వత్తిడి వరకు వివిధ జీవులు తట్టుకుంటున్నాయి. ఇక సూర్య రశ్మి, సూర్యుడు అందించే వేడి కారణంగా జీవుల ఉనికి ఉన్నది. కాని సముద్ర గర్భంలో లావా నుండి వెలువడే వేడి (ం100 డిగ్రీల కంటే ఎక్కువే!) ఆధారంగా జీవించే జీవులను కనుగొన్నారు. అట్లానే భూమిపై ఉష్ణకూపాలవద్ద మరుగుతున్న నీటిలో కూడా జీవించగల బాక్టీరియా ను కనుగొన్నారు. అంటే జీవం ఉనికికి ఉష్ణం అవసరం – అది సూర్యుని నుండి కాని మరే ఇతర కారణంగా కాని జీవుల ఉనికికి అవసరం అని నిర్ధారించారు. భూమిపైన ఉన్న జీవులలో కార్బన్, హైడ్రోజెన్ ప్రధాన మూలకాలు. అంటే జీవోద్భవానికి హైడ్రోకార్బన్ ప్రధాన మూలకం అని భావించవచ్చును. అంతరిక్షం నుండి భూమిపైకి వచ్చి పడే రాతి శకలాలలో ఈ హైడ్రోకార్బన్ లను కనుగొన్నారు. అంటే విశ్వంలో జీవ ఉద్భవానికి ప్రధాన మూలకమైన హైడ్రోకార్బన్ విస్తారంగా ఉన్నదని అర్ధం చేసుకోవచ్చును. ఇక మరొక ప్రధాన మూలకం నీరు. భూమిపైననే కాక, ఇతర గ్రహాల పైన, వాటి చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలపైన కూడా నీటి జాడలు కనుగొన్నారు.
ఇక భూమి అక్షాంశం 23 డిగ్రీల పక్కకి ఒరిగి ఉన్నది. ఈ కారణంగానే సూర్యుని చుట్టూ జరిగే ఒక పరిభ్రమణంలో భూమిపైన నాలుగు ఋతువులు వస్తుంటాయి. వేసవి, వర్ష ఋతువు, శీతా కాలం, వసంతం వస్తుంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగాను, ధ్రువాల వద్దకు పోయినకొద్ది ఎండ తీవ్రత తగ్గి చలి అధికమవుతుంది. పైగా ఉత్తరార్ధ భాగంలో వేసవి ఉన్నప్పుడు, దక్షిణార్ధ భాగంలో చలికాలం ఉంటుంది. ఈ ఋతువుల మార్పు కారణంగా వేడి గాలి ధ్రువాలవైపు పయనిస్తుంది. మొత్తంగా భూ ఉపరితల చలి, ఉష్ణోగ్రత్తలు అదుపులో ఉండి జీవులకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి ఉపగ్రహమైన చంద్రుని గురుత్వాకర్షణ కారణంగా సముద్రాలలో ఆటుపోట్లు ఉండి సముద్ర జలాల ప్రవాహనికి వీలు కలిగింది. ఈ పై అన్నీ కారణాల వలన భూమిపైన, సముద్రాలలోని జీవానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఏ ఇతర గ్రహం పైన అయినా ఇవే పరిస్థితులు ఉండే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తెలియవచ్చింది. ఒక వేళ ఏదేని గ్రహం పైన మొత్తంగా మనవంటి పరిస్థితులు లేకపోయినా, కొన్ని అయినా ఉన్నప్పుడు అక్కడ కూడా జీవం ఉద్భవించే అవకాశాలు ఉంటాయి. అయితే అటువంటి జీవులు భూమిపైన గల జీవులకంటే వైవిధ్యం కలిగి ఉండే అవకాశాలు ఎక్కువే! భూమి మీద జీవపరిణామం ఏ విధమైన ముందస్తు ప్లాన్ ప్రకారం జరుగలేదు. ఖండాల కదలిక వలన అగ్నిపర్వతాల పేలుళ్ళు, ఆకాశం నుండి బ్రహ్మాండమైన రాతి శకలాలు భూమిని ఢీకొని సునామీలు, వేల కిలోమీటర్ల వైశాల్యంలో మొత్తం జీవ వినాశనం వంటి విపత్తులు అనేకం జరిగాయి. తత్కారణంగా అనేక సార్లు భూమిపై జీవులలో 90% పైగా వినాశనమయి మళ్ళీ తిరిగి కొత్త జీవుల ఆవిర్భావం జరిగింది. ఒకప్పుడు భూమిని ఏలిన బల్లిజాతి జీవులు మొత్తంగా తుడిచిపెట్టుకుపోయి, వాటి స్థానంలో క్షీరజాలు పుట్టుకువచ్చాయి. మొత్తంగా జీవపరిణామం అనేక అవాంతరాలను, విపత్తులను దాటుకుని నేటి దశకు చేరింది. స్థూలంగా చెప్పాలంటే జీవపరిణామానికి ఏ విధమైన ప్రణాళికా లేదు. ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ జే గౌల్డ్ చెప్పిునట్లు భూమిపై జీవపరిణామాన్ని ఫిల్మ్ తీసి తిరిగి ప్లే చేస్తే మానవులు ఉద్భవిస్తారని గారంటీ ఏదీ లేదు. మనకు తెలిసిన ఈ భూమిపైననే ఇన్ని అవాంతరాలను అధిగమించి జీవపరిణామం జరిగితే, వేరే ఇతర గ్రహాలపైన జీవానుకూల పరిస్థితులు ఉన్నా అక్కడ కూడా జీవపరిణామం అనుకోని కొత్త మలుపులు తిరుగుతూ జరుగవచ్చును. మరి అటువంటప్పుడు అక్కడి జీవులు భూమి పైన జీవులతో అవే హైడ్రో కార్బన్ మూలకాలతో ఏర్పడినా వారు అంతిమ జీవపరిణామం వేరుగా ఉండే అవకాశాలే ఎక్కువ. గ్రహాంతర వాసుల గురించి అనేక ఊహాగానాలు, కధనాలూ ప్రచారంలో ఉన్నాయి. మొదటగా వారు మానవుల వలెనే ఉండనవసరం లేదని, ఇతర గ్రహాలపై వేరే వాతావరణ పరిస్థితులు ఉండేకారణంగా, జీవపరిణామం భూమిపై వలే కాకుండా, వేరే పద్ధతిలో జరగవచ్చును కనుక, అక్కడ ఉద్భవించే జ్ఞానజీవులు మానవ ఆకారాన్ని గాని, అందుకు దగ్గరగా ఉండే ఆకృతినిగాని కలిగి ఉండనవసరంలేదని చాలామంది శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు. ఉదాహరణకు, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండే పెద్ద సైజు గ్రహాలపై, ఒక మేఘం లాగా సంచరించే అనేక కోట్ల సూక్ష్మజీవుల గుంపుకు సామూహిక చైతన్యం ఏర్పడి, ఆ సమూహం ఒక జ్ఞాన జీవిగా అవతరించవచ్చునని కొందరి వాదన. మరికొందరు, నీరు అధికంగా ఉండే గ్రహలపై ఆక్టోపస్ లేదా డాల్ఫిన్ల రూపంలో జీవులు జ్ఞానజీవులుగా అవతరించవచ్చునని చెప్తున్నారు. మరికొందరు, బల్లిజాతి సరీసృపాలు, భూమిపై జరిగినట్లుగా అవి అంతరించిపోకుండా ఉంటే, వాటినుండి ద్విపాదులైన, మానవులను పోలిన జ్ఞానజీవులు ఉద్భవించే అవకాశం ఉండవచ్చునని ప్రతిపాదిస్తున్నారు. అనేక రకాలైన ఊహాగానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే, ఒక్క విషయాన్ని ముందుగా మనం గుర్తుంచుకోవాలి. మానవుడు కోతిరూపంలో ఉన్నప్పుడు అతనికీ, మిగతా జంతుజాలానికి పెద్దగా తేడా ఏదీలేదు. గుంపులుగుంపులుగా చెట్లపై జీవనం సాగించినా, ఆ కోతుల గుంపునకు సామాజిక సంబంధాలు అత్యంత ప్రాధమిక స్థాయిని దాటి పెరగలేదు. సంస్కృతి అసలే ఏర్పడలేదు. అయితే, మిగతా జంతువులకంటే ఆ కోతుల గుంపు పరిస్థితి కొంత మెరుగనే చెప్పాలి. ఏదోఒక ప్రాధమిక స్థాయిలో వాటికి పరస్పర సంబంధాలు ఏర్పాటు అయ్యాయి. అయితే, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో చెట్లపై నివసించే కోతుల జీవన విధానంలో దాదాపు 30 లక్షల ఏళ్ళక్రిందట ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు సంభవించాయి. వాతావరణంలో జరుగుతూన్న మార్పుల వలన, ఆ ప్రాంతంలోని దట్టమైన అడవి ప్రాంతం వర్షాభావం వలన, పచ్చిక బయలుగా మారిపోయింది. దీనితో ఆ కోతుల గుంపు కొత్త పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. చెట్లపై నివసించే ఆజీవులు, నేలపై తిరుగాడుతూ, ఆహారం కోసం వెదుకులాడుకొనే పరిస్థితి తలెత్తటంతో, అవి రోజూ ఎక్కువ దూరాలు సంచరించవలసిన అవసరం ఏర్పడ్డది. పైగా, తన గుంపునుండి వేర్పడిన కోతి, తన సహచరులను వెదుక్కోవటానికి ఎక్కువ సమయం వెనుక కాళ్ళపై నిలబడి, తలఎత్తి, గడ్డి పైనుండి చూడవల్సి రావటంతో, నెమ్మదిగా వాటికి, రెండు వెనుక కాళ్ళపై నడిచే పద్ధతి అలవడిరది. దీనితో వాటి శరీర నిర్మాణంలోనూ, శరీరాకృతిలోనూ మార్పులు సంభవించాయి. ఆహారంకోసం ఇతర జంతువులను వేటాడటం, ఆ మాంసాన్ని చీల్చి, గుంపులోని ఇతరులతో పంచుకోవలసిరావటం కారణాన, వాటి ముందుకాళ్ళు, అంటే చేతులలో మార్పులు జరిగాయి. నెమ్మదిగా పనిముట్లు వాడటం అలవడటంతో, వాటి వెన్నెముక ఏర్పాటులో, చేతి కండరాలు, వేళ్ళ అమరికలో మార్పులు వచ్చి, నేటి మానవుని చేతి ఆకృతి ఏర్పడిరది. చేతితో పనిచెయ్యగలిగిన సామర్ధ్యం ఏర్పడటంతో, మానవుడు శ్రమచెయ్యటం అలవర్చుకున్నాడు. ‘‘కోతి నుండి మానవ పరిణామంలో శ్రమ పాత్ర’’ అన్న వ్యాసంలో మార్క్స్ సహచరుడు, కమ్యూనిస్టు సిద్ధాంత నిర్మాతల్లో ఒకరు ఫ్రెడరిక్ ఏంగెల్స్, 1876లో తొలిసారిగా ఒక కొత్త ఆలోచనకు తెరతీశారు. చేతి కండరాల అమరిక, చేతి వేళ్ళ ఏర్పాటు, నిటారుగా నిలబడగలిగిన శరీరాకృతి, చతుష్పాద జంతువునుండి ద్విపాద జీవిగా మార్పుచెందటంలో శ్రమ పాత్ర, తదితర అంశాలపై ఆ తరువాత 150 ఏళ్ళుగా జరిగిన పరిశోధనలు ఏంగెల్స్ వివరించిన గతితార్కిక ప్రతిపాదనలు సరైనవేనని రుజువు చేశాయి. అదేవిధంగా, టి రెక్స్ వంటి వేటాడి జీవించే కొన్ని సరీసృపాలలో వస్తువుల దూరాన్ని, వాటి గమన వేగాన్ని, ముందున్న రెండు కాళ్ళను ఉపయోగించి ఆహారాన్ని పట్టుకోవటం వంటి అవసరాలకు కొంతవరకూ దుర్భిణీ దృష్టి (బైనాక్యులర్ విజన్) సామర్ధ్యం ఏర్పడినా, అది చాలా పరిమితమైనది. అట్లానే గుడ్లగూబ వంటి పక్షులలో కూడా ఈ సామర్ధ్యం ఉన్నా, అది ఆహారం కోసం జరిపే వేటలో దాని శరీరాంగాల కదలికలను నియంత్రించటానికి మాత్రమే ఉపయోగపడిరది. తలకు రెండువైపులా కళ్ళు అమరి ఉండే జంతువులలో ఈ దుర్భిణీ దృష్టి ఏర్పడటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తాము చూసే దృశ్యాన్ని మూడు డైమన్షన్లలో పరికించి, వస్తువుల మందాన్ని, తమనుండి వాటిదూరాన్ని అంచనావెయ్యగల సామర్ధ్యం క్షీరజాలలో, ముఖ్యంగా ప్రస్ఫుటంగా కోతిజాతి జంతువులలో ఏర్పడటంతో, వాటికి మిగతా జంతువులకంటే మిన్నగా ప్రపంచాన్ని పరిశీలించే సామర్ధ్యం అలవడిరది. అదేకాకుండా, తమ చేతుల, కాళ్ళ కదలికలను తాము వేటాడబోయే జీవిని తరిమి పట్టుకునేందుకు సమర్ధవంతంగా ఉపయోగించేందుకు తమ దుర్భిణీ దృష్టిని ఉపయోగించటంతో, వాటిలో మెదడు అభివృద్ధి అతిత్వరగా జరిగింది. ఇక మానవ పరిణామంలో ఈ దుర్భిణీ దృష్టి సామర్ధ్యంతో బాటుగా, నిలువైన శరీరాకృతి, పనికి అనువైన కాళ్ళు, చేతుల అమరిక ఏర్పడిన కారణంగా, అతడు ఆహారం కోసం వెదకటం, వేటాడే జంతువుల దూరాన్ని, వాటి పరుగు వేగాన్ని అంచనా కట్టడం నేర్చిన తరువాత, ఆ కోతి రూపంలో ఉన్న తొలిమానవులలో త్వరితగతిని మెదడు అభివృద్ధి సాధ్యపడిరది. గుంపులుగా ఆహారంకోసం వేటాడటం, జంతువులను పట్టుకుని చంపేందుకు, బళ్ళెం వంటి ఆయుధాలకు పదునైన రాతి మొనలను ఏర్పాటుచేయటం, ఆతరువాత ఆహారాన్ని చీల్చటంకోసం పదునయిన రాళ్ళ వాడకం…. ఇవన్నీ అతడి శ్రమకు రూపమిచ్చాయి. శ్రమతోబాటుగా, గుంపులోని ఇతరులకు సంజ్ఞలద్వారా సమాచారాన్ని అందించటం మొదలై, నెమ్మదిగా అరుపులు, కేకలతో సంభాషించుకోవటం మొదలయ్యింది. తద్వారా భాషకు రూపం వచ్చింది. శ్రమలేనిదే, మానవునికి సంఘజీవనం, తద్వారా భాష అలవడవలసిన అవసరం లేనే లేదు. చేతివేళ్ళ అమరిక, మెదడుకు, చేతి కదలికలకు ఏర్పడిన అనుసంధానం కారణంగానే, మానవుడు తనకు, తన చుట్టూ ఉండేవారి అవసరాలను తీర్చటంకోసం వస్తువుల తయారీ అలవర్చుకున్నాడు. ఆవిధంగా సమాజపరమైన శ్రమను చేయటం ద్వారానే మానవుని మెదడు, తద్వారా నాగరికత అభివృద్ధి చెందటం జరిగింది. కళా రూపాలైన లయబద్ధమైన సంగీతం, గానం, భావగర్భితమైన నృత్యం, ఇవన్నీ మెదడు అభివృద్ధిలో కీలకమైన అంశాలు. ఉదాహరణకు భారతీయ నృత్యం, యూరప్ లోని బాలే నృత్యం ఇవన్నీ నృత్యకళ మాధ్యమం ద్వారా హావభావ ప్రదర్శనకు మంచి తార్కాణాలు. ఈ నృత్యాలలో శరీరాన్ని లయబద్ధంగా, భావ ప్రకటనకు ఉపయోగించటం మానవాభివృద్ధికి తార్కాణాలు. అట్లానే జిమ్నాస్టిక్స్ లో యువతీయువకులు కఠోర శ్రమతో, తమ శరీరాన్ని అత్యంత సునిశితమైన వ్యాయామంద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించటం మానవప్రగతిలో మరొక కీలకమైన అంశం.
సెల్: 9848933545