సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్రవిజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2018లో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూపు
1 మెయిన్ పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునివ్వటం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గ్రూపు1 మెయిన్స్ పరీక్షను 2020 డిసెంబరులో నిర్వహించి 2021 ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు. అయితే ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్పై అనేక మంది అభ్యర్థులు ఎపీ హైకోర్టును ఆశ్రయించడంతో జవాబు పత్రాలను మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని గతంలో ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఇప్పుడు గ్రూప్
1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీలో అధికార పార్టీకి చెందినవారే సభ్యులుగా ఉండడం సరైంది కాదన్నారు. 2018 గ్రూపు1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. హైకోర్టులోనైనా అభ్యర్థులకు న్యాయం జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించాలని, రానున్న కాలంలోనైనా జవాబు పత్రాలను మాన్యువల్ మూల్యాంకనం చేయాలని కోరారు. గ్రూపు
1 మెయిన్ రద్దు నిరుద్యోగ బాధితుల విజయం : ఏఐవైఎఫ్
ఏపీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూపు1 మెయిన్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారించి ఆ పరీక్షను రద్దు చేసి మరలా మెయిన్ పరీక్షను ఆరు నెలల్లో నిర్వహించాలని కోర్టు తీర్పు ఇవ్వటం నిరుద్యోగ బాధిత అభ్యర్థుల విజయమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహంకాళి సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 169 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ఇచ్చిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మెయిన్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. మెయిన్ పరీక్ష పేపర్ వాల్యూషన్లో ఏపీపీఎస్సీ కార్యదర్శి, సభ్యులు వారికి అనుకూలంగా కొంత మందిని నియమించుకున్నారని చెప్పారు. ఈ అంశంపై గ్రూపు
1 బాధిత అభ్యర్థులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి కోర్టును ఆశ్రయించటం జరిగిందన్నారు. ఈ కేసును విచారించిన కోర్టు మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఏఐవైఎఫ్ స్వాగతిస్తుందన్నారు. ఏపీపీఎస్సీ అధికార పార్టీ సంస్థగా మారిందని, పోటీ పరీక్షల్లో పాల్గొనే నిరుద్యోగులు కూడా ఏపీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకలతో వారికి నమ్మకం పోయిందన్నారు. తక్షణమే సభ్యులను మార్చి, కొత్త వారిని నియమించి గ్రూపు`1 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.