రానున్న రోజులలో పాడేరులో తెదేపా కనుమరుగు కానుందా…?
అయోమయంలో పార్టీ శ్రేణులు
ఇతర పార్టీల వైపు మొగ్గే అవకాశం…!
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసిపిని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతరేక ఓటు చీలకుండా చూసుకోవల్సిన బాధ్యత ఎంతో ఉందని, అందుకే ఇతర పార్టీలతో జతకట్టామని చెప్పుకొంటున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి పోత్తులతో పాడేరు నియోజకవర్గంలో కుదేలవుతుందా? అంటే అవుననే చెప్పక తప్పదు. ఒకప్పుడు టిడిపి కంచుకోటగా నిలిచిన పాడేరు నియోజకవర్గం ఆ పార్టీ స్వయంకృతాపరాధంతో నేడు నియోజకవర్గంలో కనుమరుగయ్యే స్థాయికి చేరుకుందని చెప్పక తప్పదు. ఈ నియోజక వర్గంలో చివరి సారిగా 1999లో గెలిచిన టిడిపి, 2009 నుండి మిత్రపక్షాలతో పొత్తులు కట్టి, పొత్తులలో భాగంగా తమ మిత్రపక్షానికి టిక్కెట్ కట్టబెట్టి నియోజక వర్గంలో తమ పతనానికి తామే కారణమయ్యింది. 1999లో వామపక్షాలతో జత కట్టిన టిడిపి ఇక్కడి టిక్కెట్ ను సిపిఐకి కట్టబెట్టింది. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో బిజెపితో జతకట్టి బిజెపికి కట్టబెట్టింది. ఫలితంగా ఇక్కడి ప్రజలలో పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికలలో స్వయంగా పోటి చేసినప్పటికీ అప్పుడు జరిగిన ఎన్నికలలో ఓడిపోయింది. రానున్న 2024 ఎన్నికల కోసం జనసేన, బిజెపితో జత కట్టింది. ఈసారి కూడా పొత్తులో భాగంగా ఇక్కడి టిక్కెట్ బిజెపికి కేటాయించబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో నియోజక వర్గంలో ఉన్న టిడిపి శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఫలితంగా ఇక్కడి టిడిపి ముఖ్య నేతలతో పాటు వారి అనుచర వర్గం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా పొత్తులతో టిడిపి పాడేరులో కుదేలవుతుందని చెప్పక తప్పదు. దాదాపు వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఈ ప్రాంతంలో టిడిపికి కలిసి వస్తుందనుకుంటున్న తరుణంలో ఆ పార్టీ అధిష్టానం ఈ టిక్కెట్టును మిత్రపక్షానికి కేటాయించి పాడేరు నియోజకవర్గంలో పార్టీని భూస్థాపితం చేయాలని చూస్తుందేమోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చర్చించుకుంటున్నారు.