కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ పై బీజేపీ తరపున సురేంద్రన్ బరిలోకి దిగారు. కేరళ బీజేపీ చీఫ్ గా సురేంద్రన్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు సురేంద్రన్ పై 242 క్రిమినల్ కేసులు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కేసుల వివరాలను మూడు ఫుల్ పేజీల్లో సురేంద్రన్ ప్రకటించారు. ఎర్నాకులం బీజేపీ అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ పై కూడా 211 క్రిమినల్ కేసులు ఉన్నారు. సురేంద్రన్ కేసులపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జార్జ్ కురియన్ మాట్లాడుతూ… ఆయనపై నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు 2018లో జరిగిన శబరిమల ఆందోళనలకు చెందినవని చెప్పారు. వీటిలో చాలా కేసులు కోర్టుల్లో ఉన్నాయని తెలిపారు. మరోవైపు, రాహుల్ గాంధీ ఇంకా తన కేసుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 4. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8.