-ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు
విశాలాంధ్ర-రాప్తాడు : వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాప్తాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు సూచించారు. మండలంలోని పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శుక్రవారం అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాల పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వసంతబాబు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉల్లంఘనలు లేకుండా ఖచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలన్నారు.
ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నిర్లక్ష్యంతో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న నూతన నియమాలను తెలుసుకోవడానికి శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
పోలింగ్ ప్రారంభించడానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్లో 50కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, వేసిన ఓట్లు వీవీప్యాట్లోని స్లిప్పులతో సరిచూసిన అనంతరం ఈవీఎంను క్లియర్ చేసి నిర్దేశిత సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.
బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పొరపాట్లు రాకుండా ఎన్నికల నిర్వహణ నూరు శాతం విజయవంతం చేయాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి.సీతారాం, ఈడీటీలు, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.