. లౌకిక ఇండియా కూటమిని గెలిపించండి
. బీజేపీకి వంతపాడుతున్న వైసీపీ, టీడీపీ, జనసేనకు గుణపాఠం
. సీపీఐ మేనిఫెస్టో విడుదల చేసిన రామకృష్ణ
విశాలాంధ్ర-విజయవాడ: జనం కోసం
జనం మధ్యకు` జన ప్రణాళిక పేరుతో సీపీఐ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే అమలు చేయాల్సిన అంశాలను సీపీఐ తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న సీపీఐ మేనిఫెస్టోను పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజలు, కార్మికులు, నిరుద్యోగులు, మైనార్టీల సమస్యలు, సహకార రంగానికి ప్రోత్సాహం, మహిళలకు రక్షణ తదితర అంశాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు రామకృష్ణ తెలిపారు. కాంగ్రెస్, సీపీఎం, ఇతర ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలు బలపర్చిన సీపీఐ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేనిఫెస్టోలోని అంశాలను ప్రాధాన్యతా క్రమంలో అమలు జరిగేలా పార్టీ పని చేస్తుందని, ప్రజలకు మెరుగైన జీవితం అందించటానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో దేశంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోదీ సర్కార్ను, రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీజనసేన
బీజేపీ కూటమిని ఓడిరచాలని రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీబీజేపీ
జనసేన కూటమి కాషాయపార్టీకి నిస్సిగ్గుగా వంతపాడుతున్నాయని విమర్శించారు. లౌకిక ఇండియా కూటమిని గెలిపించాలని ప్రజలకు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సీపీఐ సహా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఇండియా కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక దాసరి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్ను నిర్ణయించే లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ, టీడీపీ పరస్పర నిందలకే పరిమితమవుతున్నాయని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఆ పార్టీలకు పట్టడం లేదని విమర్శించారు. వ్యవసాయ పరిస్థితి, పారిశ్రామికరంగం, సాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక సమస్యలు, అభివృద్ధి గురించి మాట్లాడని ఆ పార్టీలు…రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అలవికాని హామీలు గుప్పిస్తున్నాయని ఆరోపించారు. ఒకరు పింఛన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నామంటే…మరొకరు రూ.4వేలు ఇస్తామని, వలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఫైలుపై తొలిసంతకం చేస్తాననిఇ ముఖ్యమంత్రి జగన్ అంటే…వలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్, చంద్రబాబు చేసే వాగ్దానాల అమలుకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధానమైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ రెండు పార్టీలకు వంత పాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన మోదీ రైతులను మోసం చేశారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ…ఏటా జాబ్క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తామని జగన్ నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీతో పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. సీపీఎస్ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐదుగురు సభ్యులతో సీపీఐ మేనిఫెస్టో రూపొందించిందని చెప్పారు. కమిటీ సభ్యులు వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలతో చర్చించి…మేనిఫెస్టో రూపొందించామన్నారు. రైతాంగ వ్యవసాయ రుణాల రద్దు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధర, గ్రామీణ పేదలకు సాగుభూముల పంపిణీ, కనీస వేతనం రూ.26 వేలు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల విధానం రద్దు చేసి వారందరినీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయటం, సామాజిక న్యాయం, సీపీఎస్ రద్దు తదితర అంశాలతో మ్యానిఫెస్టో రూపొందించామని రామకృష్ణ చెప్పారు.
మోదీ మైండ్ గేమ్ను తిప్పకొటండి
కేంద్రంలోని బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని గ్రహించిన ప్రధాని మోదీ 370, 400 సీట్లు అంటూ మైండ్గేమ్ ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ఉత్తరాదిన బీజేపీకి సీట్లు భారీగా తగ్గుతున్నాయని చెప్పారు. మోదీ పదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామానికి పాతరేశారని, లౌకికవాదాన్ని మట్టు పెట్టారని చెప్పారు. ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చటానికి ఏమాత్రం వెనుకాడరని చెప్పారు. 2014లో భారతదేశం అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే…నేడు రూ.205 లక్షల కోట్లుకు చేరిందన్నారు. అప్పు చేసిన డబ్బుతో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, ఇతర కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.
దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తుంటే పేదరికం తగ్గినట్లు మోడీ ఎలా చెప్పుకుంటారని రామకృష్ణ ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చివరికి న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల ద్వారా మార్పు తీసుకురాకపోతే దేశానికి ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన సీపీఐ ఎన్నికల మేనిఫెస్టోను రామకృష్ణ విడుదల చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఓబులేసు, కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ పాల్గొన్నారు.