ఆప్ఘనిస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందిన సంగతి మరువకముందే తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ వెల్లడించారు. మఅతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరదలతో ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని.. 150 మందికి పైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని కాబూల్ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్పైనే ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించినా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.