వరదన కొట్టుకు పోతున్న వాడికి చిన్న కర్ర ముక్క కూడా ప్రాణ రక్షక ఉపకరణంగా కనిపిస్తుంది. అయితే ఆ కర్ర ముక్క ముంచేదో తేల్చేదో తెలియక పోవచ్చు. అప్పుడు ముణిగిపోతున్న ఏ వ్యక్తికైనా సంధి ప్రేలాపనల లాంటివి సహజమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక స్థితి ఇప్పుడు సరిగా ఇలాగే ఉన్నట్టుంది. ఒక్కో విడత పోలింగ్ పూర్తి అవుతున్నకొద్దీ మోదీలో ఓటమి భయం అంతకంతకూ పెరుగుతోంది. ఏకఛత్రాధిపత్యం అలవాటైన వ్యక్తి ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. ఇది మోదీ ఎదుర్కొంటున్న బాహ్య పరిస్థితి. అంతర్గత పరిస్థితి ఇంతకన్నా భయంకరంగానే ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్లు దక్కకుండా బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఎదురైతే నితిన్ గడ్కరి, రాజ్నాథ్ సింగ్ లాంటి వారు పురి విప్పుతారు. ఆర్.ఎస్.ఎస్. నాయకత్వం కూడా మరింత అనువైన గడ్కరీ లాంటి వ్యక్తిపైనే ఆధారపడొచ్చు. ఆ పరిస్థితి కచ్చితంగా మోదీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపే. గత నాలుగు రోజులుగా ఎన్నికల ప్రసంగాల్లో భాగంగా మోదీ ఉపన్యాసాలలో కనిపిస్తున్న అక్కసు చూస్తే ఆయన మానసిక స్థితి చెదిరిపోతోందన్న భావన కలుగుతోంది. అందుకే నిస్సిగ్గుగా అదానీ, అంబానీ టెంపోల నిండా డబ్బు సంచులు పంపుతున్నారని అందుకే రాహుల్ గాంధీ అదానీ, అంబానీ పేరెత్తడం లేదని మోదీ సంపూర్ణంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మోదీ ఈ మాటలు స్వానుభవంతో చెప్తున్నారని అందుకని అదానీ, అంబానీ పైకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ను, సీబీఐని ప్రయోగించవచ్చు కదా అని రాహుల్ గాంధీ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో అంబానీ, అదానీ పేరెత్తడం లేదని మోదీ చేసిన వాదన ఆయన వాగ్దానాలలాగే పచ్చి బూటకం. మే మూడో తేదీన మహారాష్ట్ర లోని పుణేలో, మే 5న మధ్యప్రదేశ్లోని రత్లాంలో, మే 6న అదే మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లో, మే ఏడున జార్ఖండ్ లోని లోహార్ దగా నియోజక వర్గంలో భాగమైన కొంబీర్ లో రాహుల్ అదానీ పేరెత్తి తీవ్ర విమర్శలు చేశారు. అంటే మోదీ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. ఎవరు ఏ మాట చెప్పినా దాన్ని రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ కో లేదా ప్రతిపక్షాలకో అంటగట్టే స్వభావం ఉంది. ఎన్నికల సమయంలో ఎజెండా నిర్ణయించవలసింది అధికార పార్టీ. కానీ మోదీ కి నిర్దిష్టమైన ఎజెండా ఏమీ లేదు. గత పదేళ్ల కాలంలో సాధించిన విజయాల గురించి చెప్పుకునే అవకాశమూ లేదు. ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భమే లేదు. అయోధ్యలో రాముడికి గుడి కట్టించినందుకు హిందువులు ఏక మొత్తంగా మోదీని నెత్తికెత్తుకుంటారన్న ఆశా మిగలలేదు. ప్రధానమైన ఏ అంశాన్నీ అధికార పార్టీ ప్రతిపాదించనందువల్ల ప్రతిపక్షాలు లేవనెత్తే నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అంశాలే ప్రజలకు చర్చనీయాం శాలైనాయి. ఈ అంశాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించబోతున్నాయి. రాహుల్ ఈ మధ్య అదానీ, అంబానీ పేరెత్తక పోవడానికి వారి దగ్గర నుంచి టెంపోలకొద్దీ డబ్బు సంచులు అందడమేనని మోదీ అడ్డంగా వాదిస్తున్నారు. గత పదేళ్ల కింద అదానీ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే అదానీ సంపాదించిన లాభాలు, స్వాధీనం చేసుకున్న వనరులు లెక్క లేనంతగా పెరిగిపోయాయి. చాలా మంది డబ్బు ఇచ్చి పుచ్చుకోవడమే, లేదా డబ్బు ఇచ్చి తమకు ప్రయో జనం కలిగించే పనులు చేయించుకోవడమే అవినీతి అనుకుంటారు. కానీ ఉన్నత పదవుల్లో ఉన్న వారి అవినీతి దీనికి అతీతమైంది. అవినీతి కేవలం వ్యక్తులకు, వారి ప్రయోజనాలకు పరిమితమైంది కాదు. లంచం మాత్రమే అవినీతి కాదు. ఒక వర్గం, లేదా గుప్పెడు మంది వ్యాపార ప్రయోజనాలకోసం ప్రభుత్వం రూపొందించే విధానాలను సిద్ధం చేయ డం అన్నింటికన్నా పెద్ద అవినీతి. వ్యక్తుల స్థాయిలో అవినీతి వ్యక్తులకే నష్టం కలిగించవచ్చు. కానీ కొంతమంది సన్నిహితుల వ్యాపారాభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాలను మెలి పెట్టడం అత్యంత ప్రమాదకరమైన అవినీతి. మోదీకి నా అనే వారు లేరు కనక అవినీతికి పాల్పడవలసిన అగత్యం ఏమిటి అనే ప్రశ్నించే వారిది అమాయకత్వం మాత్రమే కాదు. అవినీతి విస్తృతి దాని దుష్పరిణమాల లోతు పాతులు తెలియనందువల్లే బేలగా ఇలాంటి వాదనలు ముందుకు తోస్తుంటారు. హిందూ మతోన్మాద రాజకీయాలవల్ల మోదీ ఏలుబడిలో జరిగిన నష్టం కన్నా ఆయన అనుసరించిన ఆశ్రిత పెట్టుబడి దారీ విధానంవల్ల కలిగిన నష్టం చాలా ఎక్కువ. అందుకే ఆర్థికాంశాల సారమే రాజకీయాలు అంటారు.
అదానీ బాగోతం వెలికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. అదానీతో మోదీకి ఉన్న సంబంధాన్ని ఎండగడ్తూనే ఉన్నారు. పార్లమెంటులోనూ ఈ అంశం అనేక సార్లు చర్చకు వచ్చింది. అదానీకి మోదీ మద్దతువల్ల జాతీయ ఖజానా, వనరులు ఎలా కొల్లబోతున్నాయో రాహుల్తో ప్రతిపక్షాలు అనేక సందర్భాలలో ఆందోళన వ్యక్తం చేశాయి. అదానీ మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఆయనతో ఉన్న సంబంధాన్ని ప్రశ్నించినా ఒక్క సారి కూడా మోదీ పెదవి విప్పి సమాధానం చెప్పలేదు. పదేళ్ల పాటు ఈ విషయంలో మోదీ మౌనం చరిత్రాత్మకమైంది. వినాశకరమైంది. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరవాతనైనా మోదీ ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఆరోపణలను ఖండిరచలేదు. గౌతం అదానీ ప్రైవేటు జెట్ విమానాన్ని మోదీ వినియోగించుకున్న వైనాన్ని రాహుల్ పార్లమెంటు వేదిక మీద ఫొటోలు చూపి నిలదీసినా మోదీ నోరు మెదపలేదు. పేరుకు పరువు నష్టం కేసులో కొద్ది రోజులు రాహుల్ పార్లమెంటు నుంచి బహిష్కృతుడైనా అదానీ అంశాన్ని పదే పదే లేవనెత్తడమే అసలు కారణం. ఎన్నికల వాతావరణాన్ని రాజకీయ విశ్లేషకుల కన్నా, రాజకీయ నాయకులకన్నా రాజకీయ ప్రాపకంపై ఆధారపడ్డ పెట్టుబడిదార్లే కచ్చితంగా అంచనా వేస్తారేమో. అందుకే అదానీ నుంచి మోదీకి డబ్బు సంచులు అందడం ఆగిపోయిందేమో! అదానీ, అంబానీ వ్యాపార ప్రయోజనాలు ఏమిటో మోదీకి క్షుణ్నంగా తెలిసినట్టే మోదీ నాడి చూసి ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ధారించుకునే సామర్థ్యం అంబానీ, అదానీకే కాదు ఆశ్రిత పెట్టుబడి దారీ వర్గంలో అపారంగా ఉంటుంది. మోదీ అసలు బెంగ ఇదే. అందుకని టెంపోలలో అదానీ, అంబానీ నుంచి డబ్బు ముడ్తున్నం దువల్లే రాహుల్ వారి పేరెత్తడం లేదని పెద్ద రహస్యం కనిపెట్టినట్టు మోదీ ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికలు జరగడానికీ కొద్ది నెలల ముందు దాకా అంబానీ ఏ పక్షాన ఉండే వారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే పెట్టుబడిదార్లకు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే సామర్థ్యం ఎంత బలమైందో అర్థం అవుతుంది.