ప్రధానమంత్రి మోదీ నియమించిన ఎన్నికల కమిషనర్లు ఏలిన వారి అడుగులకు మడుగులొత్తడానికి పోటీ పడ్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణ సవ్యంగా, అన్ని పక్షాలకు సమానావకాశాలు ఉండేలా జరుగుతాయనడానికి ఆస్కారమే లేదు. నామినేషన్ దాఖలు చేయడమైనా, పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలన్నా అనేక అవాంతరాలు ఎదుర్కోక తప్పడం లేదు. ఒక వేపున ప్రధానమంత్రి మోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రసిద్ధ ధ్వన్యనుకరణ నిపుణుడు, హాస్యకారుడు శ్యాం రంగీలా నానా యాతన పడవలసి వచ్చింది. ఆయన రెండు రోజులు వారణాసి ఎన్నికల అధికారి (జిల్లా కలెక్టర్) కార్యాలయం చుట్టూ తిరిగితే తప్ప నామినేషన్ పత్రాలు దాఖలు చేయడమే కుదరలేదు. కొన్ని సార్లు రంగీలాను జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖాలు చేయాలన్నా అగచాట్లు పడాల్సిందే. ఈ అవాంతరాలు మోదీని విమర్శించే వారికి మాత్రమే కాదు. మోదీ భావజాలానికి దగ్గరగా ఉండే ఆలోచనా ధోరణి ఉండేవారికి కూడా వారాణాసిలో నామినేషన్ దాఖలు చేయడం దుర్లభమే అయింది. పోటీ చేయాలనుకున్న వారికి కనీసం నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వెసులుబాటు కూడా ఎన్నికల కమిషన్ కల్పించలేక పోయింది. వారణాసి నుంచి పోటీ చేయాలనుకున్న గో సేవకులు నామినేషన్లు దాఖలు చేయడం కూడా పెద్ద విజయంగా మిగిలిపోయింది. గో సం రక్షకుల పక్షాన ఆంధ్రప్రదేశ్ కు చెందిన శివకుమార్ ఎలాగో నామినేషన్ దాఖలు చేయగలిగారు. కానీ ఆయన పేరు ప్రతిపాదించిన వారిని వేధిస్తున్నారని జ్యోతిష్మఠ శంకరాచార్య పీఠాధిపతి స్వామీ అవిముక్తేశ్వరానంద అంటున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థి మీద ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్వయంగా వారణాసి మేయరే ఈ బెదిరింపు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని శంకరాచార్య అన్నారు. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను బెదిరించే వారు మోదీ సమర్థకులో, బీజేపీ నాయకులో, కార్యకర్తలో కారు. సాక్షాత్తు ప్రభుత్వాధికారులే ఒత్తిడి చేస్తున్నారు. వారణసి మేయర్ అర్థ రాత్రి ఇళ్లకెళ్లి ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి పోటీ చేసే అభ్యర్థుల ఇంటికి రాత్రి రెండు గంటలకు నామినేషన్ దాఖలు చేసిన వారి తలుపు తట్టి ఉప సం హరించుకోవాలనీ, ఆ అభ్యర్థి పేరు ప్రతిపాదించిన వారి మీద కూడా సాగుతోంది. పోరాడి నామినేషన్ వేసిన మిమిక్రీ కళాకరుడు శ్యాం రంగీలాది మరో కథ. సాంకేతిక కారణాలు చూపి రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ మంగళవారం తిరస్కరించారు. రంగీలా అందజేసిన అఫిడవిట్ ‘‘అసంపూర్ణంగా’’ ఉందట. ఆయన ప్రమాణం పత్రం దాఖలు చేయలేదట. ప్రమాణం చేయించవలసిన బాధ్యత రిటర్నింగ్ అధికారిది కాదా! ప్రమాణం స్వీకరించినట్టు రంగీలా తరవాత పత్రం తీసుకుని వెళ్లినా ఫలితం లేకపోయింది. నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారమే ఆఖరి తేదీ అయినా అక్కడి అధికారులు రంగీలాను, ఆయన న్యాయవాదిని మరుసటి రోజు రమ్మనడంలో ఏదో దురుద్దేశం దాగి ఉందన్న వాస్తవం బుధవారం నామినేషన్ తిరస్కరించడంతో రుజువైపోయింది. మంగళవారం రంగీలా అడిగిన పత్రాలన్నీ తీసుకుని వెళ్తే ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’’ అని గద్దించి పంపించేశారు. రంగీలా మళ్లీ బుధవారం వెళ్లి కలిస్తే మంగళవారం కదా రావాల్సింది అని అధికారులు దురుసుగా సమాధానం చెప్పారు. రంగీలా పేరు ప్రఖ్యాతులున్న మిమిక్రీ కళాకారుడు కనక ఆయన గోడు వెళ్లబోసుకుంటే వినేవారు కొందరైనా కనిపించారు. సాదా సీదా మనుషులు ఇండిపెండెంటుగా పోటీ చేయాలనుకుంటే, వారికి అధికారులనుంచి ఇలాంటి ఛీత్కారాలే ఎదురై ఉంటే దిక్కెవరు?
ఇది నామినేషన్ల గొడవ. ఓటు వేయాలనుకున్న వారిని నిరోధించిన సంఘటనలూ ఉత్తర ప్రదేశ్ లో దండిగానే ఉన్నాయి. మాఫియా ముఠాలను, గూండాలను తుదముట్టించేశాం అని ఫీుంకరిస్తున్న యోగీ ఆదిత్యనాథ్ రాజ్యంలో ఓటు వేసే వారికి అడ్డుపడిన సంఘటనలు కనీసం రెండు విడతల పోలింగ్లో ఎదురైనాయి. 19వ తేదీన జరిగిన తొలి దశ పోలింగులో రాం పూర్, మొరాదాబాద్, ముజఫÛర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో ముస్లింలు ఓటు వేయడానికి వచ్చినప్పుడు వారిని నిరోధించడానికి, నిరుత్సాహపరచడానికి పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది అనేక ఎత్తులు ఎత్తారు. ముస్లిం ఓటర్ల గుర్తింపు తనిఖీ చేయడంలో భాగంగా కావాలని జాప్యం చేశారు. కొంతమైందినైతే ఓటు వేయనివ్వకుండా తిప్పి పంపించారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఈ అవరోధాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు ఏ చర్యా తీసుకున్నట్టు లేదు. సంభల్ లోనూ ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. సంభల్ లో మే ఏడవ తేదీన పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న చోట దాడులు జరిగాయి. ఓటు వేయడానికి బారులు తీరిన వారిని అడ్డుకున్నారు. కొందరిని వెనక్కు పంపించేశారు. దీనికి సంబంధించిన కథనాలు కొన్ని స్వంతంత్రంగా వ్యవహరించే వెబ్ సైట్లలో ప్రచురించారు. కానీ అవి ఎన్నికల కమిషన్ దృష్టికి రావు గాక రావు. మన్సూర్ పూర్, ఒవరీ, షబాజ్ పూర్ కలాన్, ముబారక్ పూర్ లాంటి అనేక గ్రామాలలో ఓటేయడానికి వచ్చిన ముస్లింలను బెదరగొట్టి పంపించేశారు. 30-40 వాహనాల్లో వచ్చిన పోలీసులు గబగబా వాహనాలు దిగి బారులు తీరిన ముస్లిం ఓటర్ల ఓటరు కార్డులను, ఓటింగు స్లిప్పులను, ఆధార్ కార్డు లాంటి వాటిని లాగేసుకున్నారు. మహిళలని కూడా చూడకుండా బారుల్లో నిలబడిన వారి మీద పోలీసులు లాఠీలూ ప్రయోగించారు. ఓటర్లను తరిమేస్తున్న వీడియోలూ ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎన్నికల కమిషన్ కు ఇలాంటివి కనిపించవుగా! ముస్లింలు అధిక సంఖ్యలో లేని పోలింగ్ కేంద్రాలున్న ఒక్క చోట కూడా పోలీసులు పనిగట్టుకుని ఓటర్లను తరిమేసిన సంఘటన జరగలేదు. అంటే ముస్లింలు ఓటు వేయకుండా అడ్డుకోవడానికి యోగీ రాజ్యంలో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఇలా వ్యవహరించడానికి పై అధికారుల సమ్మతి ఉండే ఉంటుందనడంలో సందేహం లేదు. ముస్లిం ఓటర్లను నిరోధించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ సాగించిన విద్వేష ప్రచారం అధికారులకు స్ఫూర్తి కలిగించి ఉంటుంది. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు జియా ఉర్ రహమాన్ ఆరోపించడంలో తప్పేముంటుంది. సంభల్ నియోజకవర్గంలో 2019లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఈ సారి అడ్డుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. వీటిని చెదురుమదురు సంఘటనలుగా కొట్టి పారేయడానికి వీలు లేదు. ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా దిగజార్చే ప్రయత్నాలు ఉత్తరప్రదేశ్ లో తీవ్రంగా జరుగుతున్నాయి.