ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మతోద్రేకాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతోపాటు విపరీతంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఇలా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. అలాగే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రవర్తనావళిని ఉల్లంఘించారనుకున్నప్పుడు బీజేపీ కూడా సహజంగానే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తోంది. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో విచిత్రంగా ప్రవర్తిస్తోంది. మోదీకి నేరుగా నోటీసు జారీ చేయడానికి ఎన్నికల కమిషన్ జంకుతోంది. అందుకే బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు మీ పార్టీ నేతలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని సలహా ఇవ్వండి అని హితవు పలికింది. అలాగే రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదులు వచ్చినప్పుడూ నేరుగా ఆ వ్యక్తులకు నోటీసు ఇవ్వకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేకు ఓ సలహా పారేసింది. మోదీకి నోటీసు ఇవ్వడానికి జంకినందువల్లే రాహుల్ విషయంలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసు ఇవ్వడంతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో ఒక్కో దశ ముగుస్తున్న కొద్దీ మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రచార సభల్లో విపరీతమైన విష ప్రచారం కొనసాగిస్తున్నారు. సకల నియమాలనూ ఉల్లంఘించి మతోద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్ అయితే ఉత్తరప్రదేశ్లో రోడ్లమీద నమాజు చేసేవారు అదృశ్యమయ్యారని అన్నారు. ఆయన ముస్లింలను ఉద్దేశించే ఈ మాట అన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ నాయకుడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారించుకున్నప్పుడు ఎన్నికల కమిషన్ వారి మీద నామ మాత్రమైన చర్య అయినా తీసుకుంటుంది. వారిని ఒక రోజో లేదా రెండు రోజులో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని నిర్దేశిస్తుంది. కానీ మోదీ, అమిత్ షా విషయంలో ఒక్కసారి కూడా ఇలాంటి చర్య తీసుకోలేదు. చివరకు బుధవారం ప్రధాన ఎన్నికల ప్రచారకులు ‘‘మతపరమైన’’ ప్రసంగాలు చేయకూడదని అలాంటి ప్రసంగాలు చేసిన వారికి కాకుండా బీజేపీకి సందేశం పంపింది. సమాజాన్ని విభజించే ప్రకటనలు చేయకూడదని కూడా తెలియజేసింది. అదే రీతిలో కాంగ్రెస్ కు పంపిన సందేశం మరీ విచిత్రంగా ఉంది. ‘‘రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు’’ లాంటి తప్పుడు అభిప్రాయాలు కలగ చేయకూడదని కోరింది. కాంగ్రెస్ నాయకులు, లేదా ఇతర ప్రతిపక్ష నాయకులు మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని భయాందోళనలు వ్యక్తం చేయడం నిరాధారంగా చేస్తున్న ఆరోపణకాదు. బీజేపీ సీనియర్ నాయకుడు హెగ్డేతో పాటు అనేక మంది బీజేపీ నాయకులు ఎన్.డి.ఎ. కూటమికి 400 కన్నా ఎక్కువ స్థానాలు ఇచ్చి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని పదే పదే చెప్తూనే ఉన్నారు. ఈ మాటలను మోదీ ఖండిరచినప్పటికీ అది ఉదాహరణ ప్రాయమైంది మాత్రమే. అమితమైన మెజారిటీ దక్కితే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడంతో పాటు చేయదలచుకున్న పనులేమిటో మోదీకి కచ్చితమైన అభిప్రాయం ఉంది. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకులం కాదు కానీ మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమని మోదీనే అంటున్నారు. నిజానికి ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లు కావు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఈ ప్రాతిపదికన దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు దక్కాయి. ఇస్లాం మతానుయాయులైనప్పటికీ వారిలోని కొన్ని వర్గాలకు సైతం రిజర్వేషన్లు మొదటి నుంచీ అమలు అవుతున్నాయి. కానీ ఈ సదుపాయం కల్పించిన సందర్భంలోనే రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడైన డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇతర వెనుకబడిన వర్గాల వారూ ఉన్నారని చెప్పడంతో మొట్ట మొదట ఈ విషయం తేల్చడానికి కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు అయింది. అయితే ఆయన నివేదిక సమర్పించిన సమయంలోనే ఈ నివేదికను తాను నమ్మడం లేదు అని చెప్పడంతో ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత రాష్ట్రాలకు వదిలేశారు. కేంద్ర స్థాయిలో మండల్ కమిషన్ ఏర్పాటు, ఆ కమిషన్ సిఫార్సులు ఏళ్ల తరబడి అటక మీదే ఉండిపోవడం లాంటి అంశాలు చరిత్రలో భాగం. వివిధ రాష్ట్రాలు క్రమంగా ఇతర వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాయి. చివరకు మండల్ కమిషన్ నివేదిక విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అమలైంది. ఈ వ్యవహారం మోదీకి, బీజేపీ నాయకులకు తెలియక కాదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్లు లాగేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ పట్టించుకున్న పాపాన పోలేదు.
బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేకు జారీ చేసిన నోటీసులో తమ ప్రధాన ప్రచారకులు మర్యాద ఉల్లంఘించకుండా చూసుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది. మోదీ, తదితర బీజేపీ నాయకులు ఎంత మత విద్వేషం రెచ్చగొట్టినా ఎన్నికల కమిషన్ కంటికి కనిపించదు. చెవికి వినిపించదు. నోటికి తాళం వేసుకు కూర్చుంటుంది. ఎన్నికల సమయంలో దేశ సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి భంగం కలిగించకూడదని ఎన్నికల కమిషన్ చెప్పడం సరైందే కావచ్చు. కానీ ఈ మాట ఎవరికి చెప్పాలో వారికి చెప్పకుండా ధర్మపన్నాలు వల్లించడం ఎన్నికల కమిషన్ నిష్క్రియా పరత్వానికి నిదర్శనం. ఏ పక్షం నాయకులు సామాజిక, సాంస్కృతిక వాతావరణానికి భంగం కలిగిస్తున్నారో తేల్చే ఉద్దేశం ఎన్నికల కమిషన్కు లేదు. గుండు గుత్తగా ఉభయ పక్షాలకు నోటీసులు జారీచేసి తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు నమ్మించడానికి తంటాలు పడుతోంది. ఎన్నికల కమిషన్ నడ్డాకు నోటీసు జారీచేసిన తరవాత ఆయన తన పార్టీ నాయకులను కట్టడిచేసిన దాఖలాలే లేవు. మోదీని నియంత్రించే సత్తా ఆయనకు ఎలాగూ లేదు. ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని లాగకూడదని కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉంది. ఎన్నికల కమిషన్ దృష్టిలో ప్రతిపక్షాలు అగ్నిపథ్ పథకాన్ని తప్పుపట్టడం కాంగ్రెస్ ప్రస్తావించడం ఉల్లంఘన కింద కనిపించింది. అగ్నివీరులను నియమించే పథకం ఉపాధికి సంబంధించిన అంశం. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని నాలుగేళ్ల తరవాత ఇంటికి పంపించేస్తారు. ఆ తరవాత వారికి సైనికులకు దక్కే సదుపాయాలు ఏమీ ఉండవు. ఇదీ ప్రతిపక్షాల అభ్యంతరం. నిరుద్యోగులకు ఎదురవుతున్న సమస్య. ఇది ఎన్నికల కమిషన్కు ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడంగా కనిపించడం వారి అమాయకత్వం కాదు. మోదీ ఆజ్ఞకు బద్ధులై, మొత్తం ఎన్నికల క్రమాన్ని బీజేపీకి అనుకూలంగా మలచడంలో భాగం. ఆ కమిషన్ అధినేతలకు నాణానికి ఉన్న బొరుసే కనిపిస్తుంది తప్ప బొమ్మ కనిపించదు.