విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రభుత్వ పథకాల రూపంలో ఖాతాదారుల ఖాతాల్లో జమ అయిన డబ్బులను పాత బకాయిలకు జమ చేయకుండా ఖాతాదారులకు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత వంటి పథకాల సొమ్మును ఖాతాదారులకు ఇవ్వకుండా బ్యాంకు మేనేజర్ రంగప్ప పాత బకాయిలకు జమ చేసుకుంటానని వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ఖాతాదారులకు జమ అయిన నిధులను బ్యాంకులు పాత బకాయిలకు జమ చేయకుండా ఖాతాదారులకు ఇవ్వాలని చెపుతుందని, కాని ఇక్కడ మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. ఇక్కడి బ్యాంకు మేనేజర్ రంగప్ప మాత్రం ప్రభుత్వ నిబంధనలు పక్కకు నెట్టి పథకాల ద్వారా వచ్చిన సొమ్మును మీకు ఇచ్చేదిలేదు పాత బకాయిలకు జమ చేసుకుంటామని దబాయిస్తూ, బ్యాంకు నుండి బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు మరియు దేవాదాయ ధర్మాదాయ భూములకు కూడా పంట నష్టపరిహారం అందజేసి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బికెఎంయు నాయకులు కుమ్మరి చంద్ర, తిక్కన్న, మునిస్వామి, రంగన్న, ఖాజా తదితరులు పాల్గొన్నారు.