ఎడారిని తలపిస్తున్న సరస్సు
. వృక్ష ,జంతుజాలానికి ముప్పు
. కనుమరుగవుతున్న కొల్లేటి పక్షులు
విశాలాంధ్ర బ్యూరో`ఏలూరు : ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఒకరకంగా కనుమరుగు కాబోతోంది. నెర్రలిచ్చిన నేల వెక్కిరిస్తోంది. ప్రకృతి ప్రసాదిత ఈ సహజ సిద్ధ కొల్లేరు గత వైభవాన్ని కోల్పోయి ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. రాష్ట్రంలోని ఏలూరు, పశ్చిమ, కృష్ణా జిల్లాల మధ్య 9 మండలాల్లోని 120 గ్రామాలలో విస్తరించి ఉన్న ప్రఖ్యాతి గాంచిన ఈ సరస్సులో ప్రస్తుతం కనుచూపుమేరలో నీటి జాడ కానరావడం లేదు. 75 వేల ఎకరాల్లోని కొల్లేటి అభయారణ్యం పరిరక్షణ పెద్ద సమస్యగా మారింది. సరస్సు గర్భం, ముఖ ద్వారంతో పాటు పరిసరాలన్నీ కళతప్పి నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు నిత్యం విదేశీ స్వదేశీ పక్షులతో కళకళలాడే సరస్సు నేడు బోసిపోయింది. ఈ ఏడాది మార్చి మొదటివారం నుంచి ఎండలు ముదరడంతో కొల్లేరు పరీవాహ ప్రాంతాల్లో ఎక్కడా విదేశీ పక్షుల కూతల జాడలేదు. సరస్సు మొత్తం ఎండిపోయింది. గరిక కూడా పెరగని పరిస్థితి నెలకొనడంతో సరస్సులో పశువులు కూడా కనిపించడం లేదు. సహజ సిద్ధ కొల్లేటి వైభవాన్ని భావితరం వెబ్ పేజీల్లో వీక్షించి మురిసిపోయే ప్రమాదం ఎంత దూరంలో లేదని స్పష్టమవుతోంది.
కుచించుకుపోతున్న కొల్లేరు
కొల్లేరు మంచినీటి సరస్సు కృష్ణ-గోదావరి నదుల మధ్య 5వ కాంటూరు పరిధిలో308 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొల్లేరు దాదాపు అసలు పరిధి 10.7 కాంటూరు అంటే 954 చదరపు కిలోమీటర్లు ఉండాలి. కానీ 1977 తర్వాత నుంచి కొల్లేరు కూచించుకుపోతూ వస్తోంది. 1954 ముందు కొల్లేరు కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. కొల్లేరు వాసులకు తిండి గింజలు గగనమైన స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరులో వరి సాగును ప్రోత్సహించింది. 1964 నాటికి కొల్లేరు బెడ్ , బెల్ట్,గ్రామాలన్నింటిలోనూ వరి సాగు విస్తరించింది.
మాఫియా చేతుల్లో చిక్కి
నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొల్లేరులో మత్స్యకార కుటుంబాలను సొసైటీలుగా ఏర్పాటు చేసి ఆర్థిక సాయం చేసి, చేపల సాగును ప్రోత్సహించారు. ఇదే కొల్లేరు భవిష్యత్తును మార్చేసింది. నెమ్మదిగా కొల్లేరు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. మెజారిటీ మత్స్యకార సొసైటీలను బినామీలుగా మార్చేశారు. ఆక్రమణల పర్వంలో భాగంగా బడా బాబులు కొల్లేరులో పాగా వేసి చెరువులు తవ్వడం ప్రారంభించారు. 100-200 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కొక్క చెరువును తవ్వేశారు. 2000 నాటికి 15,854 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువులు తవ్వకాలు పెరిగిపోయాయి. దాదాపు 50 శాతం కొల్లేరు ఆక్రమించేసారని, సరస్సును కాపాడుకోవాలని యునెస్కో రెండు దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సహా నిరూపించింది. ప్రధానంగా కృష్ణా, గోదావరి జిల్లాలోని సుమారు 6,000 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాల నుంచి బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు సహా 67 కాలువల నుంచి కొల్లేరుకు ప్రతి సంవత్సరం 9.59 టీఎంసీల నీరు చేరేది. ఇందులో తమ్మిలేరు నుంచి 2.01 టీఎంసీలు, 67 కాలువల నుంచి 4.51 టీఎంసీల నీరు, బుడమేరు నుంచి 2.39 టీఎంసీల నీరు చేరేది. భారీ వర్షాలు కురిస్తే 10వ కాంటూరు మునిగిపోయేది. కొల్లేటిలో నీరు ఎగదన్ని వరి పొలాలు నీట మునిగేవి. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఈ ప్రధాన నీటి వనరుల నుంచి కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. ఏలూరు ముఖ దాయని తమ్మిలేరు దాదాపు ఎండిపోయింది. గుండేరు వాగు ఆక్రమణల కోరల్లో చిక్కుకుపోయింది. బుడమేరు వాగును దారి మళ్లించారు. ఇక చిన్నచిన్న 67 కాలవలే కొల్లేటిలో నీటికి ఆధారమయ్యాయి. ఇటీవల కాలంలో గోదావరి, కృష్ణా డెల్టాలో సాగునీటికే కటకట తప్పడం లేదు. ఈ స్థితిలో కొల్లేరుకు జలకళ తప్పింది. మరోవైపు ఉప్పుటేరు ఎగదన్నుతోంది. దీంతో కొల్లేరు తన సహజ లక్షణాన్ని కోల్పోతోంది. అనేక వృక్ష, జంతు జాలాలు ఈ కారణంగా తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి.
ఆపరేషన్ కొల్లేరు అభాసుపాలు
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొల్లేరులో 120 జీవోను పశ్చిమ, కృష్ణా జిల్లాల కలెక్టర్లు 2006లో అమలు చేశారు. 5వ కాంటూరు పరిధిలో సుమారు 45,000 ఎకరాల విస్తరించి ఉన్న 1,776 ఆక్రమణ చెరువులను బాంబులతో ధ్వంసం చేశారు. కానీ నేడు ఆ చెరువుల్లో మళ్లీ చేపల సాగు సాగుతోంది. కట్టుబాటు పేరుతో ఆక్రమణల్లో ఉన్న చెరువులను ఆయా గ్రామాల పెద్దలే కాపాడుతూ రావడం విశేషం. దీని వెనుక బడాబాబుల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. పాము బాతు, జముడు తోక, జకాన, గూడబాతు, ఎర్ర కాళ్ల కొంగ, చిన్న మునుగు కోడి, గుడ్డి కొంగ, నల్ల రెక్కల ఉల్లంగి, చిన్ననీటి కాకి, నల్లతల కంకణాల పిట్ట, ఈల వేసే పెద్ద చిలుక, తెల్ల గూడ బాతు… ఇలా 224 రకాల పక్షి జాతులు ఉండేవి. ఆస్ట్రేలియా సైబీరియా తదితర ప్రాంతాల నుంచి కూడా పక్షులు వలస వస్తూ ఉంటాయి. 117 రకాల చేపల జాతులు కనిపించేవి. అయితే వీటిలో ఇప్పటికి 50 శాతం వరకు జాతులు అంతరించిపోయాయి. కొల్లేరులో 34 రకాల వృక్ష జాతులు ఉంటే అందులో 15 జాతులు ఔషధ మొక్కలు అని ఆయుర్వేద శాఖ గుర్తించింది. ప్రస్తుతం కొల్లేరులో నీరు లేకపోవడంతో పక్షులకు ఆహార కొరత ఏర్పడిరది. ఇతర ప్రాంతాలకు వలసల సంఖ్య పెరిగింది. కిక్కిస, జమ్ము, పిచ్చి మొక్కలతో కొల్లేరు నిండిపోయింది. బాతుల పెంపకం పూర్తిగా అంతరించిపోయిందనే చెప్పాలి. బాతుల వ్యర్ధాలు చేపలకు ఆహారంగా లభించడం తగ్గిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో చేపల వేట లేదని చెప్పాలి.
పేదోళ్లకు ఉపాధి కరువు
కొల్లేరు గ్రామాల్లో ఉపాధి లేకపోవడంతో వేలాది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొల్లేటినే నమ్ముకున్న వేలాది కుటుంబాలు పొట్టచేతిన పట్టుకుని పట్టణ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం తరలి వెళ్లిపోయారు. చేతినిండా పని లేకపోవడంతో మత్స్యకార సొసైటీలు ప్రస్తుతం కొల్లేరులో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొల్లేరు బతికి బట్ట కట్టాలంటే వరదలే దిక్కుగా కనిపిస్తోంది. లేదా కృష్ణా జలాలను మళ్లించాలి. కృష్ణా ఎగువ ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో గత కొన్ని సంవత్సరాలుగా నీటి విడుదల శాతం క్రిందికి తక్కువగానే ఉంటోంది. ఈ స్థితిలో కృష్ణా నది నీటిని మళ్లించడం అసాధ్యం. ఇక గోదావరి పరిస్థితి అంతేనని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ స్థితిలో ఎన్నో ఏళ్ల నాటి సహజసిద్ధ మంచినీటి కొల్లేటి సరస్సును కాపాడుకోవడం ఎలా అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలతో పాటు అందరిని వేధిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత రాబోయే ప్రభుత్వం కొల్లేరు ప్రత్యేక దృష్టి సారించి పూర్వ వైభవం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు, మేధావులు కోరుతున్నారు.