. దిల్లీ పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
. ఏడుగురు నవజాత శిశువుల దుర్మరణం
. ఆక్సిజన్ సిలిండర్ పేలుడుతోనే ఘటన
. ఆసుపత్రి యజమాని, డ్యూటీ డాక్టర్ అరెస్టు
. దోషులను ఉపేక్షించం: సీఎం కేజ్రీవాల్
న్యూదిల్లీ : గుజరాత్, రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం జరిగి తొమ్మిది మంది చిన్నారులతో సహా 33 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే దేశ రాజధానిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తూర్పు దిల్లీలోని వివేక్ విహార్లోగల పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. 12 మంది పిల్లలను మంటల్లో నుంచి తప్పించాంగానీ వారిలో ఏడుగురుని కోల్పోయామని దిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధ్యక్షుడు అతుల్ గార్గ్ తెలిపారు. మిగిలిన ఐదుగురికి మరొక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ‘వివేక్ విహార్ ప్రాంతంలోగల ఐటీఐ బ్లాక్ బీలోని బేబీ కేర్ సెంటర్ నుంచి రాత్రి 11.32 గంటలకు ఫోన్ వచ్చింది. తొమ్మిది అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఆసుపత్రి, దాని పక్క భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు 70 నిమిషాలు పట్టింది. ఇది క్లిష్టమైన ఆపరేషన్. రెండు బృందాలుగా పనిచేశాం. మా ప్రాణాలను కాపాడుకుంటూనే బాధితులను కాపాడగలిగాం. చిన్నారుల కోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. అందరినీ కాపాడలేకపోయాం.12 మంది శిశువులను బయటకు తెచ్చాంకానీ వారిలో ఆరుగురు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది దురదృష్టకర ఘటన’ అని అతుల్ గార్గ్ వెల్లడిరచారు. రాత్రి 11.30 గంటలకు బాబీ కేర్ న్యూ బార్న్ హాస్పిటల్తో పాటు దాని పక్క భవనంలో మంటలు వ్యాపించినట్లు పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా, మరొక శిశువు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడిరచారు. పోస్టుమార్టం కోసం పిల్లల మృతదేహాలను జీటీబీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆసుపత్రి యజమాని నవీన్ కిచీపై ఐపీసీలోని 336, 304ఎ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నవీన్ పట్టుబడినట్లు తెలిపారు. అలాగే డ్యూటీ డాక్టర్ ఆకాశ్నూ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడిరచారు.
ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి: రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘ఇది హృదయవిదారకం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం’ అని మోదీ, ముర్ము వేర్వేరుగా ట్వీట్లు చేశారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడిరచింది. విచారణ జరిపించాలని సీఎస్ నరేశ్ కుమార్కు ఎల్జీ సక్సేనా ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి తగు వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ‘ఈ దుర్ఘటనలో తమ పసిపిల్లలను కోల్పోయిన వారికి అండగా నిలుస్తాం. ఇందుకు బాధ్యతులైన వారిని వదిలి పెట్టం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది దురదృష్టకరమైన ఘటనని, బాధ్యులను ఉపేక్షించేది లేదని ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఒక ప్రకటన చేశారు. విచారణను వేగవంతం చేయాలని ఆరోగ్య కార్యదర్శి దీపక్ కుమార్, సీఎస్ నరేశ్ కుమార్ను ఆదేశించారు.