ఉమ్మడి రాజధానిపై త్వరలో గడువు పూర్తి
. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అనిశ్చితి
. పట్టించుకోని పాలక, ప్రతిపక్షాలు
. ప్రజల భావోద్వేగాలతో ఆటలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రమేనా…విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈ గడువు జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. అయినా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంగానీ…ప్రతిపక్షాలు గానీ దీని గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిందిగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుందో లేదో తెలియదు. వైసీపీ మూడు రాజధానులని, అమరావతే రాజధాని అని టీడీపీ, దాని మిత్రపక్షాలు చెబుతున్నాయి. రానున్న కొత్త ప్రభుత్వమైనా ఏపీకి రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజధానిపై అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది.
అమరావతి: ప్రజాపాలనకు, ప్రభుత్వ వ్యవస్థల సమన్వయానికి, చట్టాల రూపకల్పనకు కేంద్ర బిందువు రాష్ట్ర రాజధాని. పాలన సజావుగా సాగడానికి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడేది ఇదే. అయితే అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చిక్కు సమస్యగానే మిగిలి ఉంది. నేతలు ప్రతీకార రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆంధ్రా ప్రజలకు ఇప్పటికీ రాజధాని లేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిలిచిపోనుండడంతో రాజధాని నగరంపై అనిశ్చితి ఆంధ్రప్రదేశ్పై కనిపిస్తోంది. విభజన చట్టంలో భాగంగా జూన్ 2వ తేదీ వరకు మాత్రమే హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత కూడా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. రూ.1.42 లక్షల కోట్ల విలువైన ప్రజా ఆస్తుల పంపిణీ వంటి అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజధాని విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం2014... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ‘10 సంవత్సరాలకు మించకుండా’ ఉండాలని ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం హైదరాబాద్ జూన్ 2, 2024 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి 10 ఏళ్ల గడువును చట్టం నిర్దేశించినప్పటికీ గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీల మధ్య వైరుధ్యాలను, చొరవలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు రాజధాని కనుచూపు మేర కనిపించడం లేదు. జూన్ 2, 2024 గడువు కొద్ది రోజుల ముందు రాజధానిపై ఆంధ్రప్రదేశ్లో రాజకీయపార్టీలు మౌనం వహిస్తున్నాయి. సొంత రాజధాని నిర్మించుకోవడానికి పదేళ్ల గడువు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది. విచిత్రమేమంటే...ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ అధ్యక్షులు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని నలిపేసిన వైసీపీ సర్కార్ వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనతో తన ముందున్న అమరావతి రాజధాని కలలను తుంగలో తొక్కారు. వికేంద్రీకరణ, సంక్షేమ-కేంద్రీకృత పాలనను సమర్థిస్తూ సీఎం జగన్ అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, కీలకమైన కార్యనిర్వాహక రాజధానిగా ఓడరేవు నగరం విశాఖపట్టణాన్ని ప్రతిపాదించారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖపట్నానికి మకాం మారుస్తున్నట్లు సీఎం జగన్ అనేకసార్లు హామీ ఇచ్చారు. కానీ మాట నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు. వైసీపీ ప్రకారం... రాజధాని చట్టపరమైన చిక్కుల్లో ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించిన అంశాలు సుప్రీంకోర్టులో పెండిరగ్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్కు అమరావతిలో ‘ప్రపంచస్థాయి భవిష్యత్తు, స్మార్ట్ రాజధాని’పై విస్త్రతంగా ప్రచారం జరిగింది. దీనిని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూపొందించారు. 2015లో రూ.51 వేల కోట్లతో ‘ప్రజల రాజధాని’ నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని చంద్రబాబు సేకరించారు. రాజధాని అభివృద్ధి ప్రణాళికలో రైతులను భాగస్వాములను చేస్తానని హామీ ఇచ్చారు. సింగపూర్కు చెందిన సంస్థలను ఆశ్రయించి ప్రాజెక్టు నిర్మాణానికి వేల కోట్లు చెల్లించారు. గృహ, పట్టణాభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ.7,500 కోట్లు, ప్రపంచ బ్యాంకు నుంచి రూ.200 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,500 కోట్లు సేకరించారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాజధానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులను కొత్త ముఖ్యమంత్రి నిలిపివేయడమే కాకుండా రాజధాని బడ్జెట్ను రూ.500 కోట్లకు తగ్గించారు. దీంతో ప్రపంచ బ్యాంకు, సింగపూర్ సంస్థలు ప్రాజెక్టు నుంచి వైదొలిగాయి. అమరావతి ఇప్పుడు దెయ్యాల రాజధానిలా కనిపిస్తోంది. గత పదేళ్లలో తమ భావోద్వేగాలు, సమస్యల పట్ల ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర ప్రజలు నిందించారు. నాయకులు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదని ప్రజలు భావిస్తున్నారు. ఉమ్మడి రాజధానికి సంబంధించి జూన్ 2తో గడువు ముగుస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుముఖత వెలిబుచ్చారు. కేసీఆర్ హయాంలో ఆస్తుల పంపిణీపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. రూ.1.42 లక్షల కోట్ల విలువ గల మొత్తం 245 సంస్థలు పంపిణీ జరగాల్సి ఉంది. అందులో 91 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్
9 కింద, 142 షెడ్యూల్`12 కిందకు వస్తాయి. చట్టంలో పేర్కొనని మరో 12 సంస్థల విభజన కూడా వివాదాస్పదంగా మారింది.
ఉమ్మడి రాజధాని కోసం ఒత్తిడి అవసరం
కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ఖరారు అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించేలా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని రాజకీయ నాయకుడిగా మారిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఏడాది జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించి, ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అమరావతిపై కేవలం ప్రకటన, శంకుస్థాపన, కొన్ని పనులు ప్రారంభమైనా పూర్తిస్థాయి రాజధాని తయారు కాలేదు. అందువల్ల రాజధాని నిర్మాణం పూర్తయ్యేంత వరకూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని రాష్ట్రపతిని అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించాలని ఆయన అన్నారు. మరోవైపు వికేంద్రీకరణ, సుపరిపాలన కోసం మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించి తమ పార్టీ వైఖరిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి పునరుద్ఘాటించారు.
‘ఒక రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. వికేంద్రీకృత అభివృద్ధి. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, టీడీపీ హయాంలో నిరూపించాం. అనంతపురం టు కియా మోటార్స్, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ మొదలైనవి’ ఏర్పాటు చేశామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో రాజధాని నగరం లేకపోవడానికి మోదీ సర్కారుతో పాటు టీడీపీ, వైసీపీ కారణమని లక్ష్మీనారాయణ ఆరోపించారు. వివాదాస్పద ఆలోచనలు, వాదనలు, చట్టపరమైన చిక్కుల మధ్య జూన్ 4 ఓట్ల లెక్కింపు రోజును చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఆశాజనకమైన రోజుగా భావిస్తున్నారు.