జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, ఎస్సి దీపిక
అభ్యర్ధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన
విశాలాంధ్ర విజయనగరం : ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతీఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పి దీపిక కోరారు. విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన అభ్యర్ధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఏజెంట్లు, అభ్యర్ధులు పాటించాల్సిన నిబంధనలు, చట్టపరమైన అంశాలను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్ వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఏజెంట్ల కరదీపికలను పంపిణీ చేశారు.
జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇవిఎంలలోని ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కించడానికి వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇవిఎం ఓట్ల లెక్కింపు కోసం ప్రతీ కేంద్రంలో 14 టేబుళ్ల చొప్పున, పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుళ్ల చొప్పన, ఇటిపిబిఎంఎస్ ఓట్ల లెక్కింపు కోసం అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విజయనగరం పార్లమెంటు కు పోలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం లెండి కళాశాలలో 20 టేబుళ్లతో మరో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతీ టేబుల్ దగ్గరా ఒక కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకొనే అవకాశం అభ్యర్ధులకు ఉందని చెప్పారు. వీరు కాకుండా ఆర్ఓ దగ్గర అభ్యర్ధి లేదా జనరల్ ఏజెంట్ కూర్చొనే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్కు మూడు రోజుల ముందుగానే ఫారమ్ 18 ద్వారా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఏజెంట్ల వివరాలను అందజేస్తే, వారికి వెంటనే గుర్తింపు కార్డును జారీ చేస్తామని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందని, అరగంట తరువాత ఇవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాలవద్ద ఏజెంట్లుకు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూడు దశల్లో తనిఖీ నిర్వహిస్తారని, కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్పోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరని స్పష్టం చేశారు. పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్లను ఏర్పాటు చేస్తామని, అక్కడ సెల్ఫోన్లు డిపాజిట్ చేసి, అవసరమైనప్పుడు అక్కడే మాట్లాడుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి త్రాగునీరు కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలవద్ద ఉదయం 7 గంటలకల్లా సిద్దంగా ఉండాలని సూచించారు. ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్ వద్ద మాత్రమే కూర్చోవాలని, ఇతర టేబుళ్ల దగ్గరకు, ఇతర నియోజక వర్గాలకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రతీఒక్కరూ తమ గుర్తింపు కార్డును విధిగా ధరించాలని చెప్పారు. ఏదైనా అభ్యంతరం ఉంటే రాతపూర్వకంగా సంబంధిత ఆర్ఓకు లేదా ఎఆర్ఓకు అందజేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్దంగా ఏజెంట్లు ప్రవర్తిస్తే, వారిపై చర్య తీసుకొనే అవకాశం ఆర్ఓలకు ఉందని తెలిపారు. ఏజెంట్లు డబ్బు చెల్లించి అల్పాహారం, భోజనం పొందవచ్చునని సూచించారు. శాంతియుత జిల్లాగా మనకు గుర్తింపు ఉందని, లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసుకొని ఆ పేరును నిలబెట్టుకోవడానికి ప్రతీఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఎస్పి దీపిక మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాలు, వాటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోకి అభ్యర్ధులు, ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, అందువల్ల ఇతరులు ఆ ప్రాంతాలకు రాకుండా చూడాలని కోరారు. ఏజెంట్ల గుర్తింపు కార్డులను, తమ వద్దనున్న జాబితాలో తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని, ప్రతీచోటా తనిఖీ జరుగుతుందని తెలిపారు. వాహనాలను లోపలికి అనుమతించబోమని తెలిపారు. ఏ నియోజకవర్గంలో, ఏ టేబుల్ దగ్గర నియమితులవుతారో అక్కడే తమ విధులను నిర్వహించాల్సి ఉంటుందని, వేరే గదిలోకి పంపించడం జరగదని తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అందువల్ల ఫలితాల తరువాత ఊరేగింపులు, ప్రదర్శనలు చేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఊరేగింపుల్లో బాణాసంచా కాల్చవద్దని ఎస్పి సూచించారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఇతర అధికారులు, పోటీ చేసిన అభ్యర్ధులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.