. పోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి ` ఉద్రిక్తత
. రఫాలో మారణహోమాన్ని ఆపాలని నినాదాలు
. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 200 మంది
మెక్సికో సిటీ: రఫాలో ఇజ్రాయిల్ దురాక్రమణ, మారణహోమానికి నిరసనగా మెక్సికోలోని ఆ దేశ దౌత్యకార్యాలయాన్ని కొందరు నిరసనకారులు నిప్పుపెట్టారు. బీరు పోసి మంట పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయువును పోలీసులు వినియోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రఫా కోసం అత్యవసర చర్య అంటూ భారీ ప్రదర్శన జరిగింది. 200 మంది పాల్గొని ఇజ్రాయిల్ చర్యలను ఆక్షేపించారు. గాజాలో మారణహోమాన్ని తక్షణమే నిలిపివేయాలని నినాదాలు చేశారు. పలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న శిబిరాలపై ఇజ్రాయిల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తూ అమాయకులు ముఖ్యంగా చిన్నారులను బలిగొనడానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. శిబిరంపై ఇజ్రాయిల్ దాడి చేయగా 45 మంది చనిపోయారు. ఆ తర్వాత రోజు కూడా ఇదే తరహా దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 37వేల మంది పలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మిత్రపక్షం అమెరికాతో పాటు యావత్ ప్రపంచం సూచిస్తున్నా హమాస్ అంతమే లక్ష్యమంటూ ఇజ్రాయిల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తుఫానును ఇజ్రాయిల్ దేశ ప్రధాని నెతన్యాహు తీవ్రస్థాయిలో ఖండిరచారు. అక్టోబరు 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసినప్పుడు మీ కళ్లు ఏమయ్యాయంటూ నెటిజన్లపై మండిపడ్డారు. అనుకున్నది సాధించే వరకు తమ పోరు ఆగబోదని, ఎవరు ఏమన్నా… ఏం చేసినా లక్ష్యసాధన విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. రఫా తగలబడిపోతున్న దృశ్యాలు మానవాళిని కలిచివేస్తున్నాయి. ఐరాస ఏం చేస్తోందని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే రఫా శిబిరాల్లో 13 లక్షల మంది పలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.
కెనడాలోనూ….
కెనడా భద్రతా సదస్సు వేదిక ఆవలి పలస్తీనా అనుకూల ఆందోళనలు జరిగాయి. రాజధాని ఒట్టావాలోని కాన్సెక్ ఎగ్జిబిషన్కు వెళ్లే మార్గాలను నిరసనకారులు దిగ్బంధించారు. ఈ ఎగ్జిబిషన్లో ఇజ్రాయిల్ సైన్యం తరపున ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. రక్తంతో తడిచిన వస్త్రాలు ధరించి రోడ్లపై పడుకొని కొందరు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్కు కెనడా మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బ్యానర్లు ప్రదర్శించారు.