జెఎన్టీయు, పాలిటెక్నిక్ కళాశాలల ఆవరణల్లో కలియ తిరిగిన జిల్లా ఎస్పీ గౌతమిసాలి
విశాలాంధ్ర- అనంతపురం : కౌంటింగు జరిగే జెఎన్టీయులో పటిష్టంగా కొనసాగుతోన్న భద్రతతో పాటు ఆ ప్రాంగంణం లోపల, వెలుపల ఏర్పాట్లు …వాహనాల పార్కింగ్ మరియు బందోబస్తు చర్యలను ఎస్పీ సమీక్షించారు.
ఈ రెండు కళాశాలల ప్రాంగణాలలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఎన్టీయులోకి వెళ్లొచ్చేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ దారులు మినహాయించి మిగితా మార్గాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసుల తనిఖీల గుండా కౌంటింగు కేంద్రాల్లోకి వెళ్లొచ్చేలా చర్యలు తీసుకున్నారు.
జెఎన్టీయుకి చుట్టూ ఉన్న ప్రహరీగోడ లోపల, వెలుపల భద్రతను సమీక్షించారు. ప్రహరీగోడకు రెండువైపులా రాళ్లు, కట్టెలు లేకుండా చూడాలని మరియు పటిష్టమైన బందోబస్తు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు.
నిర్ధేశించిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ద్వారా కాకుండా ఎట్టి పరిస్థితుల్లోను ప్రహరీగోడ దూకి ఎవరూ రాకుండా నిరంతర పహారాతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు
పోటీ అభ్యర్థుల వాహనాల పార్కింగ్ ను జెఎన్టీయులోని ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనున్న నిర్ధేశిత పార్కింగ్ స్థలాల్లో నిలుపుకునేలా… మిగితా కౌంటింగు ఏజెంట్ల వాహనాలను పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో పార్కింగ్ చేసేలా ఏర్పాటు చేయమని సూచించారు. జిల్లా ఎస్పీ తో పాటు అనంతపురం, ఏ.ఆర్ డీఎస్పీలు టి.వి.వి.ప్రతాప్, మునిరాజ, సి.ఐ లు రెడ్డెప్ప, క్రాంతికుమార్, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.