16 ఎంపీ సీట్లు గెలిచిన టీడీపీ, కేంద్రంలో చక్రం తిప్పనున్న బాబు
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ, జేడీయూదే కీలక పాత్ర
ఎన్డీయే నుంచి బాబు బయటకు రావాలంటోన్న ఆర్థిక వేత్త
ఏపీ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి 164 సీట్లను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. దీంతో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2019 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
లోక్ సభలో 543 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఎన్డీయే కూటమి 293 స్థానాల్లో గెలిచింది. 240 సీట్లు గెలిచిన బీజేపీ.. మెజార్టీ మార్క్ అయిన 272 సీట్లకు కొంత దూరంలో నిలిచింది. దీంతో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలకం కానున్నారు. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలుపొందగా.. జేడీయూ 12 సీట్లు సాధించింది.వీరిద్దరూ పక్కకు తప్పుకుంటే ఎన్డీయే కూటమి బలం 293 నుంచి 265 స్థానాలకు పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మరో ఏడు సీట్లు అవసరం అవుతాయి. బాబు, నితీశ్ ఎన్డీయే కూటమిలోనే కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ.. వీరిద్దర్నీ తమ వైపు తిప్పుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోవాలని 2009-12 మధ్య యూపీఏ హయాంలో భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా పని చేసిన డాక్టర్ కౌశిక్ బసు చంద్రబాబుకు సూచించారు. 2012-16 మధ్య వరల్డ్ బ్యాంకులో చీఫ్ ఎకనమిస్ట్గా పని చేసిన డాక్టర్ బసు.. కార్నెల్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ బోధిస్తున్నారు. ఆయనకు గతంలో చంద్రబాబుతో మంచి పరిచయాలే ఉన్నాయి. చంద్రబాబు సమర్థత, లౌకికవాదం పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ఆకట్టుకుంటాయన్న బసు.. ఈ లక్షణాలను కొనసాగించేందుకు ఎన్డీయే నుంచి బాబు వైదొలిగితే బాగుంటుందన్నారు.
ప్రభుత్వంతో నాకు సంబంధం ఏర్పడక ముందే (2009కి ముందే).. నేను కలిసిన అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ఢిల్లీలో ప్రొఫెసర్గా ఉన్న సమయంలో ఆయన్ను కలిశాను. ఆర్థిక విధానాల విషయమై నేరుగా ఒకరికొకరం మాట్లాడుకునేందుకు ఆయన నన్ను అప్పట్లో ఆహ్వానించారు. చంద్రబాబు సమర్థత, సెక్యూలరిజం నన్ను ఆకట్టుకున్నాయి. ఈ రెండింటిని అట్టిపెట్టుకోవడం కోసం చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతారని ఆశిస్తున్నాను్ణ్ణ అని డాక్టర్ బసు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్టు చేశారు.
డాక్టర్ బసు సూచనల పట్ల నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికల ముందే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని.. ఇప్పుడు కూటమి నుంచి వైదొలగడం అనైతికం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న బాబు సెక్యులర్ ఎలా అవుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.