విశాలాంధ్ర – ధర్మవరం : చరిత్ర మరిచిపోలేని వ్యక్తి రామోజీరావు అని టిడిపి నాయకులు కమతం కాటమయ్య ,పరిసే సుధాకర్, మహేష్ చౌదరి, పురుషోత్తం గౌడ్, చిగీచెర్ల ఓబిరెడ్డి, భీమనేని ప్రసాద్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు టిడిపి కార్యాలయంలో రామోజీరావు మృతి పట్ల సంతాప సభను ఏర్పాటు చేశారు. అనంతరం వారి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి శ్రేణులు మాట్లాడుతూ రామోజీరావు అంచలంచలుగా ఎదిగి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడని తెలిపారు. తెలుగు పాఠకులకు సినీ రంగానికి, వారి మృతి తీరని లోటు అని తెలిపారు. తొలుత ఆయన మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం వహించి, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. జర్నలిజం లో ఆయన కలం పట్టుకుంటే తిరుగు లేదని ఎంతోమంది ఆయనను బెదిరించిన అదరని, బెదరని అనివ్యక్తి రామోజీరావు అని తెలిపారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలిపారు. రామోజీ తన జీవితములో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒక అక్షర యోధుడిగా పోరాటం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.