. రాష్ట్రపతి, నరేంద్ర మోదీ, రేవంత్, ప్రముఖుల సంతాపం
. చంద్రబాబు, లోకేశ్ దంపతులు శ్రద్ధాంజలి
. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
. రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరో అమరావతి/హైదరాబాద్ : పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావు (88) కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూనే శనివారం తెల్లవారు రaామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. స్టెంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా మారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే శనివారం మృతి చెందడంతో వెంటనే ఫిల్మ్సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబరు 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ. కుటుంబ సభ్యులు రామోజీరావుకి తొలుత ఆయన తాతయ్య రామయ్య పేరు పెట్టారు. కానీ స్కూల్లో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి, తన పేరును తనే పెట్టుకున్నారు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక ఆమె కూడా తన పేరును అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పని చేశారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ ను తొలుత ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది. అలాగే రైతుల కోసం అన్నదాత పత్రికను నడిపారు. రామోజీరావు మీడియాతో పాటు అనేక వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించారు. మార్గదర్శి చిట్ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి వంటి వ్యాపారాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక రామోజీరావు హైదరాబాద్లో వేలాది ఎకరాల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ స్టూడియో ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. దీనికి గిన్నీస్ బుక్ రికార్డు కూడా లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావును దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది.
అధికారిక లాంఛనలతో నేడు అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్కు అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం అధికారులు చేపడుతున్నారు. అయితే రామోజీరావు మనవడు అమెరికా నుంచి ఆదివారం వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫిల్మీ సిటీలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన పార్థివదేహానికి అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
నేడు, రేపు ఏపీలో సంతాప దినాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని సూచిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించరాదని తెలిపారు.