ఉపాధి హామీ పనులతో పొలాలు, గరువులకు వెళ్లేందుకు రహదారిని ఏర్పాటు చేసుకున్న కడ శిల్ప గ్రామస్తులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – గ్రామస్తులంతా కదిలారు.. రహదారి నిర్మాణానికి శ్రమించారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కడశిల్ప గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో భాగంగా కల శిల్ప గ్రామస్తులంతా, తమ గ్రామం నుండి వ్యవసాయ పొలాలు, గరువులకు, కొండకు వెళ్లేందుకు రహదారిని ఏర్పాటు చేసుకోవాలని తలచారు. అదే క్రమంలో చిన్న రహదారి మార్గం గుండా ముల్లు మెట్ట, మర్రిపాలెం దేవరపల్లి గ్రామాలకు కాలినడకన వెళ్లే రహదారిని విస్తరించు కోవాలని సంకల్పించారు. ప్రభుత్వాలు, అధికారులు తమ సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవడంతో గ్రామస్తులే ఏకమై రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావడంతో గ్రామం నుండి కొండ చివరి వరకు మట్టి రహదారి ఏర్పాటుకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా పనులలో పాల్గొని శ్రమించడంతో ఎట్టకేలకు వారి యొక్క రహదారి సమస్య తాత్కాలికంగా పరిష్కారానికి నోచుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే ఈ విధంగా ప్రతి గ్రామం ఉపాధి హామీ పనుల ద్వారా ఆ గ్రామానికి కావలసిన కొన్ని పనులనైనా స్వచ్ఛందంగా నడుము బిగించి చేసుకుంటే చాలావరకు మన్య ప్రాంతంలోని గిరి గ్రామాలు కొంతమేరకైనా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కడ శిల్ప గ్రామస్తులు పాల్గొన్నారు.