విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : నగరంలో వివిధ ప్రాంతాలలో చేపట్టిన పూడికతీత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు బుధవారం పరిశీలించారు. సర్కిళ్ల వారీగా నిర్దేశించిన పూడికతీత కార్యక్రమాలను జరుగుతున్న తీరును గమనించి అవసరమైన సూచనలు సలహాలను ఇచ్చారు. కే ఎల్ పురం, కంటోన్మెంట్, కణపాక తదితర ప్రాంతాలలో పర్యటించారు.ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను జెసిబిల సహాయంతో తొలగించి వేస్తున్నారు. చిన్నచిన్న కాలువల్లో ఉన్న పూడికలను బాబ్ కార్ట్ ల సహాయంతో తొలగించి వేస్తున్నారు. యంత్రాలు వెళ్లలేని చిన్నచిన్న సందులలో ప్రత్యేక పారిశుధ్య పనివారలతో కాలువల్లో పూడికితీత లను తీయిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎంఎం నాయుడు మాట్లాడుతూ వర్షాలు కురిసే సమయంలో ప్రధాన కాలువల్లో వర్షపు నీరు సజావుగా ప్రవహించే విధంగా ఉండాలన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటి నుంచే పూర్తి చేయాలని చెప్పారు. ప్రధాన కాలువల్లో పూడికితీత పనులను ముమ్మరం చేస్తున్నామన్నారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్తాచెద్దారాలను తొలగించే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నగరంలో ఎక్కడ వర్షపు నీరు నిలవ లేకుండా నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే ప్రజలు కూడా సహకరించి కాలువల్లో చెత్తాచెదారాలు వేయకుండా నిర్దేశిత డస్ట్ బిన్ లో మాత్రమే చెత్తలను వేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, దుకాణాలలో వ్యర్ధాలను కాలువల్లో వేస్తున్నట్లు తాము గమనించామని చెప్పారు. అటువంటి చర్యలను మానుకోవాలని లేకుంటే జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు.