సార్వత్రిక ఎన్నికల తరవాత ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు బలంగాఉంటే ఎలాంటి పరిణామాలు సాధ్యమో రుజువైంది. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల గొంతు పార్లమెంటులో వినిపించే అవకాశమే రాలేదు. కాని మొన్నటి ఎన్నికలలో ప్రతిపక్షాలు బలం పుంజుకోవడంతో గొంతెత్తి మాట్లాడగలిగాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో హాత్రస్ దుర్ఘటనను ప్రస్తావించారు. ఆ మర్నాడే ఆయన హాత్రస్ వెళ్లారు. బాధితులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొక్కుబడిగా సానుభూతి వ్యక్తంచేసి చేతులు దులిపేసుకున్నారు. రాహుల్గాంధీ లోక్సభలో గుజరాత్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి తీరతాం అని సవాలు విసిరారు. 48 గంటల్లో ఆయన అహ్మదాబాద్లో ప్రత్యక్షమయ్యారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికలలో గుజరాత్లో బీజేపీని గద్దె దించుతామని బాహాటంగా ప్రకటించారు. మణిపూర్లో హింసాకాండ చెలరేగి 14 నెలలైనా మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించక పోవడాన్ని రాహుల్ తూర్పారబట్టారు. రాహుల్ రెండోసారి సోమవారం మణిపూర్లో పర్యటిస్తున్నారు. మోదీ ఏకఛత్రాధిపత్యం కొనసాగిన గత పదేళ్లకాలంలో పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చే అంశాలకు వీధుల్లో జరిగే ప్రజాందోళనలతో సంబంధమే ఉండేదీ కాదు. కానీ ఇప్పుడు వీధుల్లో వినిపించే ప్రజాసమస్యలను ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రతిధ్వనింప చేయగలుగుతున్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించిన సకల అంశాలను వీధుల్లోకెళ్లి ప్రతిధ్వనించే పనిలో పడ్డట్టు కనిపిస్తున్నారు. జనం ఘోష పార్లమెంటులో వినిపించే అవకాశం రావడం ప్రతిపక్షాలకు అత్యంత సానుకూలమైన విషయం. ఇది ప్రతిపక్షాలకు పెరిగిన బలానికి తార్కాణం. మరోరకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల విజయం. గత పదేళ్లకాలం ప్రతిపక్షాల గొంతు మూగవోయింది. మోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను బొత్తిగా ఖాతరు చేయలేదు. పార్లమెంటు లోపలా అవకాశం ఇవ్వలేదు. పార్లమెంటు బయటా ప్రతిపక్షాలుచూపిన పోరాటపటిమా పెద్దగా కనిపించలేదు. ప్రజాసమస్యలు పార్లమెంటు లోపల, బయట ప్రస్తావనకు రాకుండాచేసి మోదీ ఇష్టారాజ్యం చెలాయించగలిగారు. దీనివల్ల ఫెడరల్ స్ఫూర్తికి కూడా విఘాతం కలిగింది. కానీ రాహుల్గాంధీ ప్రతిపక్ష నాయకుడైన తరవాత జనంగోడు పార్లమెంటులో గట్టిగా వినిపించగలిగారు. అఖిలేశ్ యాదవ్, మహువా మొయిత్రా లాంటి ఇతర ప్రతిపక్ష నేతలు ఆయనకు అండగా నిలిచారు. మొన్నటిదాకా ఒక్క మోదీ గొంతే వినిపించేది. ఆయన అసత్య ప్రచారం, విద్వేషపూరిత ప్రసంగాలే జనంచెవిలో పడేవి. ఎక్కడ చూసినా మోదీ పాలన, మోదీ గ్యారెంటీ మాటే వినిపించేది. జనం ఆ మాటలువిని ఊరుకునేవారు. వారి ఆక్రందనలు వ్యక్తం చేయడానికి అవకాశమే లేకుండా పోయింది. ఈ పద్ధతి జనజీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు ప్రతిపక్షం గొంతువిప్పే స్థాయికి చేరుకుంది. ప్రతిపక్షం బలం పుంజుకోవడంవల్ల ప్రజా సమస్యలను పట్టించుకోక తప్పని పరిస్థితి ఏర్పడడం సానుకూల పరిణామం.
ప్రతిపక్షాలు బలం పుంజుకున్నందువల్ల మోదీ కోసం జనం ఎదురుచూసే పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు జనం ప్రతిపక్షం తమను పట్టించుకుంటోందన్న భరోసాతో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తమ ప్రవర్తనను సవరించుకుని మారాల్సిన అవసరాన్ని గుర్తించాయి. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ అడపాదడపా వివిధవర్గాల శ్రమ జీవుల మధ్యకు వెళ్తున్నారు. ఈ మధ్యే భవననిర్మాణ కార్మికుల దగ్గరకు వెళ్లడమే కాకుండా కొద్దిసేపు వారితో కలిసి పనిచేశారు. ఇది ప్రతికాత్మకమే కావచ్చు. కానీ ప్రతిపక్షాలు జనఘోష వినిపించుకుంటాయన్న నమ్మకం కుదురుతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రస్తుత ప్రభుత్వమే మారాలి. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఇది సాధ్యంకాలేదు. కానీ ఈ అవసరాన్ని నొక్కిచెప్పాలన్న తెలివిడి ప్రతిపక్షాలకు కలిగింది. గుజరాత్లో శాసనసభ ఎన్నికలు 2027లో కానీ జరగవు. కానీ అప్పుడైనా బీజేపీని గద్దె దించుతామని రాహుల్ చెప్పడం కాంగ్రెస్ను ఉత్సాహపరచడానికి మాత్రమే అనుకోనక్కర్లేదు. ఇతర ప్రతిపక్షాలు అందుకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని ఆయన సవాలు గుర్తుచేసింది. 2002 నుంచి గుజరాత్లో పంచాయితీ, జిల్లా, రాష్ట్రస్థాయిలో విజయం అంటే బీజేపీదే అన్న అభిప్రాయం బలపడిరది. ఈ పరిస్థితిని మార్చడానికి రాహుల్ చేస్తున్న ప్రయత్నాలతోపాటు ఇతర ప్రతిపక్షాలూ నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. హాత్రస్ బాధితులకు మరింతనష్ట పరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్కు రాహుల్ గాంధీ లేఖరాసే అవకాశం ప్రతిపక్షాల ఉమ్మడి బలంవల్లే సాధ్యమైంది. ప్రజా సమస్యలను పట్టించుకోవడాన్ని ప్రధాన స్రవంతిలోని మీడియా పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. గోదీ మీడియా ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్నలను ప్రతిపక్షాలను అడిగేస్థాయికి దిగజారింది. మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మీడియా తమ పాత్రను పునర్నిర్వచించుకోక తప్పదు. ప్రతిపక్షాలు మరింత ముందడుగు వేయాలంటే వచ్చే ఏడాది కొన్నిరాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బీజేపీకి గుణపాఠం చెప్పాలంటే నిరంతర ప్రయత్నం అవసరం. రామమందిరం ఉన్న అయోధ్య నియోజకవర్గం ఫైజాబాద్ జిల్లాలో ఉంది. అక్కడ ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన అభ్యర్థి గెలవడం అంటే బీజేపీ మతతత్వ రాజకీయాలను పరాస్తం చేయడమే. అడ్వాణీ రథయాత్ర రాజకీయాలను ఫైజాబాద్ ప్రజలు అనుమానానికి తావులేకుండా ఓడిరచగలిగారు. అయితే ఇది ఆరంభం మాత్రమే. కార్పోరేట్లు, మార్కెట్ద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యం అన్న మోదీ వితండవాదానికి విరుగుడు కనిపెట్టాలి. కార్పొరేట్సంస్థల మధ్య కూడా పోటీతత్వం ఉండాల్సిందేనని తెలియజెప్పవలసిన అవసరంఉంది. ఈ విషయంలో మోదీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టాలి. అహమదాబాద్లో రాహుల్ పర్యటించినప్పుడు ఒకవ్యక్తి లేవనెత్తిన వాస్తవాంశాన్ని రాహుల్ పిట్టకథగా వినిపించారు. ‘‘గుర్రాలు రెండురకాలు ఉంటాయి. ఒకటి రేసుగుర్రం, రెండోది పెళ్లి ఊరేగింపులో వరుణ్ని ఊరేగించే గుర్రం. కానీ కాంగ్రెస్ పెళ్లి ఊరేగింపుల్లో వాడాల్సిన గుర్రాన్ని రేసు గుర్రంగానూ, రేసు గుర్రాన్ని పెళ్లిళ్లలకు వాడుతుంది’’ అన్నది ఈ పిట్ట కథ సారాంశం. కానీ ఈ పిట్ట కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి చాలా బలమైంది. ఈ నీతి కాంగ్రెస్కే కాదు, ఇతర ప్రతిపక్షాలకు సమానంగానే వర్తిస్తుంది. పార్లమెంటు వీధుల్లో కనిపించే సమస్యల మధ్య సమన్వయం అత్యవసరం. ఈ అంశాన్ని అన్ని ప్రతిపక్షాలు గ్రహించినప్పుడే క్రమంగా ఒక్కోచోట బీజేపీని ఓడిరచడం సాధ్యం. ఆ మార్గంలో మాత్రమే ప్రజల సమస్యలు ప్రస్తావనకు వస్తాయి. అంటే ప్రతిపక్ష రాజకీయాలు రోడ్డెక్కాలి.