22 నుంచి అసెంబ్లీ సమావేశాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మరలా మూడు నెలలకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని మార్చిలో గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బడ్జెట్ కాలపరిమితి జులై 31వ తేదీతో ముగియనుం డడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా, మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో వివిధ శాఖల నిధులన్నీ దారి మళ్లించి, ఆయా శాఖల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిందని, ఇవన్నీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి గాడిన పెట్టాలంటే… పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం కావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి… అక్టోబరులో పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. తొలిరోజు ఉభయసభల నుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.